నర్సింహులపేట, ఫిబ్రవరి 19 : ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. అప్పుడే అన్నదాతకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే మాడి పోతుండడంతో దిక్కుతొచ్చని స్థితిలో ఉన్నారు. ఆకేరువాగుపై నిర్మించిన చెక్డ్యాంలు తెగిపోవడంతో నీరు నిల్వ ఉండక వాగు వట్టిపోతున్నది. దీంతో రైతులు పంటలను కాపాడేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీలతో వాగులో గుంతలు తీయిస్తూ పంట పొలాలకు నీళ్లు మళ్లిస్తున్నారు.
నర్సింహులపేట మండలంలోని వివిధ గ్రామాల శివారుల నుంచి పారే ఆకేరు వాగు ఎండిపోయింది. ముంగిమడుగు రెవెన్యూ శివారులోని చెక్డ్యాం పూర్తిగా ఎండిపోవడంతో వాగును ఆసరాగా చేసుకొని వరి సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. గంటకు రూ.3 వేలు ఖర్చు చేసి వాగులో జేసీబీలతో గుంతలు తవ్విస్తున్నారు. మరికొంత మంది రైతులు రూ.20 వేల వరకు ఖర్చు చేసి క్రేన్ సాయ బావుల్లో పూడిక తీస్తున్నారు. గత మూడేళ్ల నుంచి యాసంగి వచ్చిందంటే సాగునీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వరిపంట కాపాడేందుకు ఆకేరు వాగులోకి ఎస్సారెస్పీ జలాలు వదలాలని కోరుతున్నారు.
కూలికి పోయిన పైసలతో గుంత తీస్తున్నా
రెండు ఎకరాల పొలం పారించేందుకు పడరానిపాట్లు పడుతున్నా. ఇద్దరి పొత్తుల నాలుగు ఎకరాలు వరి సాగు చేసినం. వాటాల ప్రకారం పొలం పారించుకుంటున్నాం. వాగులో నీరు లేక పోవడంతో గుంత తీసేందుకు గంటకు రూ.2500 చొప్పున రూ.5000 పెట్టి తీయించాం. 9 ఏళ్లలో ఎప్పుడూ వాగు ఎండి పొలే. వరి పంటకు ఇప్పటికే రూ.25వేలు ఖర్చు చేసిన. మొదట్లోనే ఇలా ఉంటే చివరికి వచ్చే సరికి నీళ్లు లేకపోతే కష్టమే. పొత్తుల మోటర్ కావడంతో ఇద్దరం తలా రూ.2500 వేలు వేసుకొని జేసీబీతో గుంత తీయించినం. నీళ్లు రాకపోతే కష్టమే.
– అంగోతు రాజీ, మహిళా రైతు
నీటి కోసం అరిగోస పడుతున్నాం..
రెండు నెలలుగా వాగులో నీరు లేక పోవడంతో పంటలు కాపాడేందుకు అరిగోస పడుతున్నాం. నాటు వేసి 35 రోజులే అయింది. నీళ్లు లేక తిప్పలు పడుతున్నాం. గంటకు రూ.2,500 పెట్టి వాగులో గుంతలు తీయిస్తున్నా. ఇప్పడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎట్లనో.. ఇంకో 10 రోజుల వరకైనా వాగులోకి నీరు వస్తే పంట బతుకుతుంది. లేకపోతే కష్టమే.
– భూక్యా లింగన్న, బొడ్డితండా