వర్ధన్నపేట, జనవరి 18 : చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్ అన్నారు. ఇల్లంద గ్రామంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతువేదికలో అంతర్జాతీయ మిల్లెట్స్ దినోత్సవం సందర్భంగా చిరుధాన్యాలపై రైతులు, మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు కేవలం వరి, ఇతర వాణిజ్య పంటలే కాకుండా చిరుధాన్యాల సాగు చేయడం వల్ల రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందన్నారు. జొన్నలు, కొర్రలు, సా మలు, రాగులు, అరికెలు, ఊదలు, వరిగలు సాగు చేసుకోవచ్చని చెప్పారు.
వీటి పంట కాలం కేవలం 70 నుంచి 100 రోజులు మాత్రమేనని, పెట్టుబడి కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. వీటిని బీడు భూముల్లో కూడా సాగు చేసుకోవచ్చన్నారు. ఈ 14 రకాల చిరుధాన్యాల్లో ప్రొటీన్స్ అధికంగా ఉంటాయని, జీర్ణశక్తిని పెంచడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా దరి చేరవని వివరించారు. ప్రజలు కూడా ఆరోగ్య పరిరక్షణ కోసం చిరుధాన్యాలను తీసుకోవాలని జేడీఏ కోరారు. ఏడీఏ సురేశ్కుమార్, ఏవో రాంనర్సయ్య, డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ నర్సయ్య, ఎన్ఎస్ఎఫ్ కన్సల్టెంట్ సారంగం, కేవీకే శాస్త్రవేత్త సౌమ్య, సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాజ్కుమార్, రైతుబంధు సమితి కన్వీనర్ నాంపల్లి వెంకన్న పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి : మండలంలోని కొంకపాక రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ ఉషాదయాళ్ మాట్లాడుతూ.. మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచివన్నారు. కేవీకే మామునూర్ శాస్త్రవేత్త సీహెచ్ సౌమ్య మాట్లాడుతూ.. జనవరి, ఫిబ్రవరి నెలలు జొన్న, సజ్జ, రాగి, కొర్రలు విత్తుకోవడానికి అనుకూలమని చెప్పారు. కార్యక్రమంలో మిల్లెట్ మ్యాన్ తెలంగాణ వీర్శెట్టి, ఎన్ఎఫ్ఎస్ఎం కన్సల్టెంట్ సారంగం, ఏఈ ప్రశాంత్ కుమార్, ఏఈవోలు రవి, రాజేశ్, రాకేశ్, చందూలాల్, స్రవంతి, ఎంపీటీసీ మోహన్రావు, సర్పంచ్లు సుబ్బారావు, వర్కాల రమేశ్, పంజా మహేశ్, కో ఆర్డినేటర్ అశోక్, రైతులు పాల్గొన్నారు.