పెద్దవంగర, డిసెంబర్ 11 : రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో వరి నారుకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. ఈ తరుణంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంటను పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేసి రశీదును తీసుకొని భద్రపర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తనాలు మొలకెత్తకుంటే దుకాణదారుడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
నారుపోసిన నాలుగైదు రోజుల తర్వాత కిలో యూరియా, రెండు కిలోల డీఏపీ, కిలో పొటాషియం చల్లాలి.
చలి తీవ్రతతో నారు ఎరుపు రంగులోకి మారి చనిపోతుంది. దీని నివారణకు రెండు గ్రాములు జింక్ సల్ఫేట్ను లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి.
నారుమడి ఆకుపచ్చ తెగులు కనిపిస్తే కార్బండిజం 1.5గ్రాములును లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. మళ్లీ నాలుగైదు రోజుల వ్యవధిలో నారుమడి ఎరుపురంగులో ఫార్మాలా-4, 5, రెండుసార్లు పిచికారీ చేయాలి. దీంతో సూక్ష్మధాతు లోపాలను నివారించవచ్చు.
వరిపై కాండంతొలుచు పురుగు ప్రభావం ఉంటుంది. నారుమడి వేసిన 15రోజులకొకసారి కిలో కార్పోప్యూరాన్ 3జీ గుళికలను చల్లాలి. రెండో విడుతగా నాటువేసే వారం ముందు మరోసారి చల్లాలి.
25 నుంచి 30రోజుల నారును మాత్రమే నాటుకోవాలి.
నాటువేసే సమయంలో నారు చివరి ఆకులను తుంపి నాటితే మంచిది.
నాటు వేసే ముందు క్లోరోఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి 50లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఈ ద్రావణంలో నారును నానబెట్టి నాటుకున్నట్లయితే రసం పీల్చే పురుగును అరికట్టవచ్చు.
చలి నుంచి కాపాడేందుకు..
రాత్రివేళల్లో నారుమడిలో నీటిని తీసివేసి ఉదయాన్నే వెచ్చని బోరునీటిని పెట్టాలి.
ఎత్తు ప్రదేశాల్లో నారుమడిపైనే నారును పెంచాలి.
మంచు ప్రభావంతో నారుమడి చనిపోతుంది. కావున నారుమడి చుట్టూ కొంత ఎత్తులో కట్టెలను కట్టి వాటిపై పాత బట్టలు కానీ.. పాలిథీన్ కవర్లు కానీ కప్పాలి.
సూక్ష్మపోషకాల నివారణకు జింక్ సల్ఫేట్ ఫార్మూలా-4, 5లను పిచికారీ చేయాలి. పై జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యకరమైన నారుమడితో అధిక దిగుబడులు సాధించవచ్చు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నారుమడుల్లో సాయంత్రం వేసిన నీటిని ఉదయం తొలగించాలి. రైతులు చలి తీవ్రత నుంచి నారుమడిని కాపాడుకోవడానికి వ్యవసాయ అధికారుల సూచనలు, సలహలు పాటిస్తే మంచిది. నారుమడికి అవసరమైన వెచ్చదనం అందించే ఎరువులను, జాగ్రత్తలు పాటిస్తే ఫలితం ఉంటుంది. నారుమడులకు సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. లైసెన్స్ కలిగిన దుకణాల్లో మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రశీదులను భద్రపర్చుకోవాలి ఇది ఎంతో ముఖ్యం.