ఖిలావరంగల్, డిసెంబర్ 24: గ్రామాల్లో ఈఈఎస్ఎల్ లైట్లను అమర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బీ గోపి సూచించారు. గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలు అమర్చే అంశంపై డీఆర్డీవో కార్యాలయంలో శనివారం ఎంపీడీవోలు, ఎంపీవోలతో ఆయన సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 200 జీపీల్లో 34,000 ఈఈఎస్ఎల్ లైట్లను అమర్చినట్లు కలెక్టర్ అన్నారు. పెండింగ్లో ఉన్న 75 జీపీల్లో ఏడు వేల లైట్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, ఇన్చార్జి డీపీవో సంపత్రావు, ఈఈఎస్ఎల్ ప్రతినిధి సావిత్రీసింగ్ పాల్గొన్నారు.
గ్రీవెన్స్ను వినియోగించుకోవాలి
కలెక్టరేట్లో ప్రతి నాలుగో శనివారం నిర్వహించనున్న గ్రీవెన్స్ను దివ్యాంగులు, వృద్ధులు వినియోగించుకోవాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్లో 12 మంది కలెక్టర్కు దరఖాస్తులు అందించారు. సదరం క్యాంపులు ఏర్పాటు చేయాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో నిర్వహించిన గ్రీవెన్స్లో వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎరువుల నియంత్రణ పరీక్ష కేంద్రం
పోచమ్మమైదాన్(కాశీబుగ్గ): నగరంలోని 3వ డివిజన్ ఆరెపల్లి రైతు శిక్షణ కేంద్రంలో రూ. 2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఎరువుల నియంత్రణ పరీక్ష కేంద్రం భవన నిర్మాణ పనులను కలెక్టర్ బీ గోపి పరిశీలించారు. పురుగు మందులు, మట్టి పరీక్షల రిపోర్టును తెలుసుకున్నారు. అలాగే, సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్, పురుగు మందుల పరీక్ష కేంద్రం ఏడీఏ అవినాశ్వర్మ, ఎరువుల పరీక్ష కేంద్రం ఏడీఏ శ్రీనివాస్, మట్టి పరీక్ష కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ, వ్యవసాయ అధికారులు లలిత, రజిత, మాధవి, శైలజ, సంపత్రెడ్డి పాల్గొన్నారు.