ఆరుగాలం కష్టించే రైతన్న సాగులో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. కాలనుగుణంగా మార్పులను అనుసరించి మెళకువతో పంట దిగుబడిని పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చు తగ్గించే ఉపాయాన్ని వెదుకుతున్నాడు. ముఖ్యంగా మిర్చి పంటకు నష్టం కలిగించే తెల్లదోమ, పచ్చపురుగు, నల్లిపురుగులకు సోలార్ లైట్తో చెక్ పెడుతున్నాడు. రాత్రికాగానే ఈ లైట్ వద్దకు వచ్చి పురుగులు మాడిపోతుండగా, పురుగు మందులకు ఎకరానికి అయ్యే ఖర్చులో రూ.25వేలు ఆదా అవుతోందంటున్నాడు రామచంద్రాపురం రైతు నల్లూరి వెంకన్నబాబు.
– వెంకటాపురం(నూగూరు), నవంబర్ 22
ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలంలోని పలువురు మిర్చి రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. విభిన్న పంటలు సాగు చేయడంతో పాటు వాటిని కాపాడుకునేందుకు కొంగొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఇందుకోసం మంచి దిగుబడి, గిట్టుబాటు ధరతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న మిర్చి పంట వేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. నారు పోసింది మొదలు కాయ చేతికి వచ్చేదాకా కంటికి రెప్పలా చూసుకుకోవాల్సి ఉంటుంది.
భారీ వర్షాలు, పురుగుల బెడద కారణంగా మిర్చికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంటుంది. ఫలితంగా ఎన్నో ప్రయాసలకోర్చి పంట సాగుచేసే రైతన్నకు ఒక్కోసారి పెట్టుబడి ఖర్చు కూడా మిగలని పరిస్థితి. ఈ కష్టాల నుంచి గట్టెక్కడం ఎలా అని ఆలోచనలో పడ్డారు. ఇంతలో తెలిసిన వారి గ్రామాల్లో చేసిన సోలార్ లైట్ల ప్రయోగం గురించి తెలిసి సంబురపడ్డారు. పురుగుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు చేనులో సోలార్ లైట్లను అమర్చారు. ఒకటి రూ.3500తో కొనుగోలు చేసి ఎకరానికి ఒక్కటి చొప్పున మిర్చి తోటలో స్టాండ్ ద్వారా సోలార్ లైట్లను పెట్టారు. ఈ లైట్లు రాత్రివేళ వాటంతట అవే ఆన్ అవుతాయి.
ఆ లైట్ వెలుతురుకు తెల్లదోమ, పచ్చపురుగు, నల్లిపురుగు వచ్చి చనిపోతాయి. సాధారణంగా ఒక ఎకరం మిర్చి పంటకు పురుగు మందులు చల్లాలంటే సమారు 65 నుంచి 70వేల ఖర్చు అవుతుంది. ఈ విధానం వల్ల పురుగు మందుల వాడకం తగ్గుతుందని, సుమారు 25వేల దాకా ఆవుతుందని రైతులు చెబుతున్నారు. ఇది చూసిన సుమారు 20 మంది రైతులు తమ చేన్లలో సోలార్ లైట్లు పెట్టుకున్నారు. ఇలా ఏజెన్సీలోని మారుమూల ప్రాంతమైన వెంకటాపురంలో రైతులు అధునాతన పద్ధతుల్లో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సాగు ఖర్చు తగ్గుతుంది..
మారుతున్న కాలానుగుణంగా ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. వ్యవసాయనికి పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో, మిర్చి పంటలో పురుగులను నియంత్రించేందుకు ఈ సోలార్ లైట్లు చాలా ఉపయోగపడుతున్నాయి. మంచి దిగుబడులను సాధించేందుకు అవకాశం ఉంటుంది. – నల్లూరి వెంకన్నబాబు, రైతు, రామచంద్రాపురం