మైదాన్, నవంబర్ 8 : ఆ పిల్లలందరూ ఎక్కడిఎక్కడి నుంచో ఎగిరి వచ్చి ఒక్కచోట చేరిన వలస పక్షులు.. వారి అమ్మానాన్నలతో కలిసి పొట్టకూటికోసం పొరుగు రాష్ర్టానికి వచ్చారు. చదువుకోవాల్సిన వయస్సులో బడులకు దూరంగా బతుకుతున్నారు. ఇలాంటివారిని గుర్తించి చేరదీసిన ఓ స్వచ్ఛంద సంస్థ, ఉచితంగా వారికి విద్యాబోధన అందిస్తున్నది. వలస కార్మికుల కుటుంబాలు ఏర్పాటు చేసుకున్న గుడారాల చెంతనే ఓ చిన్నపాటి ఆశ్రమం నెలకొల్పి పిల్లలకు అక్షరదానం చేస్తున్నది.
హిందీలో బోధన
పొట్టకూటికోసం తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ పిల్లల చదువులు ప్రశ్నార్థకమవుతున్నాయి. సొంత రాష్ట్రం, ఊరు కాకపోవడం, భాష వేరు కావడంతో వలస కూలీలు ఇక్కడ తమ పిల్లలను ఏ పాఠశాలలోనూ చదివించలేకపోతున్నారు. వీరిలో కొన్ని రాష్ర్టాలకు చెందిన వారికి ఆధార్ కార్డులు సైతం లేవు. ఇలాంటి కొందరు వరంగల్లోని దేశాయిపేటలో ఉన్నారు.
బీహార్, కర్నాటక, ఒడిషా ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చారు. ఎనుమాముల మార్కెట్ పరిసరాల్లోని శీతల గిడ్డంగులు, మిర్చి, పసుపు యార్డుల్లో తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తుంటే వారి పిల్లలు గుడారాలు, గుడిసెలు, అద్దె ఇళ్లలో ఖాళీగా ఉంటున్నారు. ఇలాంటి వారిపై ఆరా తీసిన దేశాయిపేటలోని ‘ఇండియన్ డిసైపుల్స్ మిషన్’ నిర్వాహకులు ఆ పిల్లలకు చదువు చెప్పాలని నిర్ణయించారు. నిర్వాహకులు కలకోట్ల స్వామీదాస్, ఝాన్సీ దంపతులతో పాటు స్నేహితుడు పోలెపాక సుమన్, డాక్టర్ ప్రియాంక కలిసి చిన్నారులకు అక్షరదానం చేసేందుకు ముందుకొచ్చారు. అందరు పిల్లలకు అర్థమయ్యే హిందీలో పాఠాలు బోధిస్తున్నారు. దేశాయిపేటలో ఓ చోట చెట్ల కింద ప్రస్తుతం చిన్నపాటి పాఠశాలగా ఏర్పాటు చేసి విద్యాభ్యాసం చేయిన్నారు. దాదాపు 65 మంది పిల్లలను ఒకచోటుకు చేర్చి వారికి రోజూ మూడు, నాలుగు గంటల పాటు సమయం కేటాయిస్తూ చదువు చెబుతున్నారు. ఈ నలుగురు తమకు రోజూ వీలైన సమయంలో వచ్చి పిల్లలకు బోధిస్తున్నారు. బడికి దూరమై పిల్లలు ఆగం కాకుండా, బాలకార్మికులుగా మారకుండా ఉండేందుకు విద్యాదానం చేస్తూ తోడ్పాటునందిస్తున్నారు.
పిల్లలు చదువుకు దూరం కావొద్దనే..
వలస కూలీల పిల్లలు చదువులకు దూరం కావొద్దనే ఉద్దేశంతో దేశాయిపేటలో ఇండియన్ డిసైపుల్స్ మిషన్ ద్వారా చదువు చెబుతున్నాం. పలు ప్రాంతాలకు చెందిన 17 మంది అనాథలకు కూడా ఆశ్రయం కల్పించి చదువు చెప్పిస్తున్నాం. ఇది మాకు భారంగా మారినా సమాజ సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. వలస కూలీల పిల్లలకు బోధించేందుకు వసతి లేదు. ఎవరైనా ముందుకు వచ్చి పిల్లలకు నీడ కోసం షెల్టర్ సదుపాయం కల్పించాలి. పుస్తకాలు, నోట్బుక్స్, చర్మవ్యాధుల నివారణ కోసం మెడికల్ సదుపాయం అవసరం.
– కలకోట్ల స్వామిదాస్, ఝాన్సీ, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు