మూడో వన్డేలో భారత్ విజయఢంకా
3-0తో సిరీస్ కైవసం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: సంపూర్ణ ఆధిపత్యంతో చెలరేగిన టీమ్ఇండియా సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. వర్షం అంతరాయం మధ్య వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో భారత్ 119 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో) విజయం సాధించింది. పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించిన మ్యాచ్లో 36 ఓవర్లు ముగిసేసరికి టీమ్ఇండియా 225/3తో నిలిచింది. కెప్టెన్ శిఖర్ ధవన్ (58; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (98 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. శ్రేయస్ అయ్యర్ (44) వేగంగా ఆడాడు. విండీస్ బౌలర్లలో హెడెన్ వాల్ష్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం విండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257గా నిర్ణయించగా.. కరీబియన్లు 26 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటయ్యారు. కెప్టెన్ నికోలస్ పూరన్ (42), బ్రాండన్ కింగ్ (42) కాస్త పోరాడారు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి జట్టుకు శుభారంభాన్నివ్వగా.. చాహల్ 4 వికెట్లు తీశాడు. మూడు మ్యాచ్ల్లో కలిపి 205 పరుగులు చేసిన శుభ్మన్ గిల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.