ఖానాపురం, జనవరి 19 : మండలంలోని బుధరావుపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పోలీసులు, ఆలయ కమిటీ బాధ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు గుడిని మూసివేశారు. తిరిగి తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచేందుకు వెళ్లినప్పుడు హుండీ కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్సై తిరుపతి క్లూస్టీం, డాగ్స్కాడ్తో అక్కడకు చేరుకున్నారు.
డాగ్స్కాడ్తో ఆ ప్రాంతంలో పరిశీలించగా పెద్దాయి చెరువు కట్టపై హుండీని గుర్తించారు. హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించుకుపోయినట్లు గుర్తించారు. దుండగులు పక్కనే గొడ్డలిని వదిలివెళ్లారు. క్లూస్టీం ఎస్సై శ్రీధర్ ఆధారాలను సేకరించారు. కాగా, ఆలయంలో నిర్మాణ పనులు జరుగుతుండగా, భవన నిర్మాణ కార్మికులు పక్క గదిలో నిద్రిస్తున్నారు. చోరీ జరిగిన సమయంలో వారు బయటకు రాకుండా గదికి బయటి నుంచి గడియ పెట్టారు. ఆలయ కమిటీ బాధ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.