ఐనవోలు, జనవరి 17 : ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయంలో మంగళవారం మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో బోనాలు చేయడం, పట్నాలు వేయడంతో పాటు లక్షలాది మంది భక్తులు విడిది చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతుంది. ఈ మేరకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు పవిత్ర జలంతో తెల్లవారుజాము నుంచే మల్లికార్జునస్వామి, భ్రమరాంభికాదేవి, రేణుక ఎల్లమ్మ ఆలయాలను సంప్రోక్షణ(కడుగటం) చేశారు. స్వచ్ఛమైన జలం, సుగంధ ద్రవ్యాలు, నవధాన్యాలను కలశంలో మిలితం చేసి, మంత్రోచ్ఛారణలతో ఆలయ చుట్టూ తిరుగుతూ చల్లారు. అనంతరం ఆలయంలోని అర్ధపానవట్టం లింగానికి అన్నపూజ నిర్వహించారు. శివలింగాన్ని శివుని ఆకారంలో అన్నంతో అలంకరించారు. కాగా, మంగళవారం స్వామివారిని జిల్లా ట్రిబ్యునల్ జడ్జి వై సత్యేంద్ర దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో నాగేశ్వర్రావు, అర్చకులు ఐనవోలు మధుకర్శర్మ, పాతర్లపాటి శ్రీనివాస్, వేద పండితులు పురుషోత్తంశర్మ, విక్రాంత్ వినాయక్ జ్యోషి, మధుశర్మ, నరేశ్శర్మ(చిక్క), భాను శర్మ, శ్రీనవాస్శర్మ, సిబ్బంది కిరణ్, మధుకర్, నారాయణరావు, శ్రీకాంత్, రాజు, కన్నయ్య, రాజు, రాజు పాల్గొన్నారు.
పట్టువస్ర్తాలను సమర్పించిన కూనూర్ గ్రామస్తులు
ఐనవోలు మల్లికార్జునస్వామికి జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూర్ గ్రామస్తులు, ఉమామహేశ్వర దేవాలయం నుంచి ప్రతి సంవత్సరం పట్టు వస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా మంగళవారం కూనూర్ సర్పంచ్ ఇల్లందుల కుమార్, ఎంపీటీసీ సంధ్యా శ్రీనివాస్, ఆలయ చైర్మన్ నెలుట్ల అజయ్కుమార్ పట్టువస్ర్తాలను సమర్పించారు. డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, అర్చకుడు పార్లపాటి రవీందర్కు పట్టువస్ర్తాలు అందజేశారు.