నెక్కొండ, మార్చి 4 : మండలంలోని రెడ్లవాడ గ్రామం గొట్లకొండ కొండల మధ్య ఎర్రబెల్లి వంశీయులకు చెందిన దాదాపు 180 ఎకరాల భూమిని కొలను వేంకటేశ్వర స్వామి ట్రస్టు, ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర మిషన్కు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం అప్పగించారు. భూమికి సంబంధించిన పత్రాలు, మ్యాప్లను ప్రముఖ అంతర్జాతీయ యోగా గురువు కమలేశ్ డీ పటేల్ దాజీకి మంత్రి ఎర్రబెల్లి అందించారు. అంతకు ముందు మంత్రి ఆ భూమిని దాజీకి దగ్గరుండి చూపించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తరతరాలుగా తమకు వారసత్వంగా వస్తున్న భూమిని అంతర్జాతీయ యోగా కేంద్రం ఏర్పాటు కోసం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. యోగా గొప్ప జీవన విధానమని చెప్పారు. ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత, ప్రపంచ శాంతి, సౌభాగ్యానికి యోగా మూలమని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతోనే తాను ఈ మహత్కార్యానికి పూనుకున్నట్లు మంత్రి చెప్పారు. దాజీ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీరామచంద్ర మిషన్ను తెలంగాణలో విస్తరించాలన్న ఆలోచనను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు తెలుపగా, వెంటనే భూమిని అందివ్వడం అభినందనీయమన్నారు. ఆయన సహకారంతో ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ యోగా కేంద్రంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. మంత్రికి, ఎర్రబెల్లి ట్రస్టుకు దాజీ కృతజ్ఞతలు తెలిపారు.