నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 12: మహిళా దినోత్సవ కానుకగా కేసీఆర్ సర్కారు శ్రీకారం చుట్టిన ‘ఆరోగ్య మహిళ’కు విశేష స్పందన వస్తున్నది. ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి మంగళవారం జిల్లా ప్రభుత్వ దవాఖానలు, సబ్సెంటర్లలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసి ఉచితంగా పరీక్షలు చేయిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే సెంటర్కు వెళ్లి వైద్యులను సంప్రదిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాలు సందడిగా కనిపించాయి. వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు సైతం పరిశీలిస్తూ సూచనలిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలో మరికొన్ని కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.
పాలకుర్తి ప్రభుత్వ దవాఖానలో ఆరోగ్య మహిళ క్లినిక్, హెల్ప్డెస్క్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు, అలాగే భూపాలపల్లి జిల్లా రేగొండ, మొగుళ్లపల్లి పీహెచ్సీల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా, ములుగు జిల్లా మంగపేట పీహెచ్సీలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, జనగామ జిల్లా బచ్చన్నపేట సీహెచ్సీలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఖానాపురం పీహెచ్సీలో ఆరోగ్య మహిళ క్లినిక్లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి, ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.