పట్టణాలు, గ్రామాల్లో పచ్చదనం కొరవడుతోంది. రహదారులపై హరితహారం మొక్కలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. పల్లె ప్రకృతి వనాల వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో మొక్కలు ఎండిపోయి పార్కులు కళా విహీనంగా కన్పిస్తున్నాయి. పంచాయతీ సిబ్బంది సైతం మొక్కల సంరక్షణను గాలికొదిలేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు ఎండిపోయి ట్రీ గార్డులు, కర్రలు మాత్రమే మిగిలాయి. మండలంలోని పల్లె ప్రకృతి వనాల్లో నీరందక మొక్కలు ఎండిపోతున్నా అధికారులు, పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పచ్చదనం, పరిశుభ్రతే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నేడు ఆదరణ కోల్పోతున్నాయి. నీళ్లు లేక చెట్లు ఎండిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో పల్లెల్లో పచ్చదనం మాయమవుతోంది. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద జాతీయ రహదారిపై, డివైడర్ల మధ్యలో నాటిన మొక్కలు పూర్తిగా ఎండిపోయి చెట్లకు రక్షణగా ఉంచిన ట్రీ గార్డులు మాత్రమే మిగిలాయి. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మొక్కల సంరక్షణ చేపట్టాల్సిన జీపీ అధికారులు ప్రభుత్వం మారిన అనంతరం పట్టించుకోవడమే మానేశారు.
హరితహారం మొక్కలు, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల సంరక్షణ కోసం కేసీఆర్ ప్రభుత్వం జీపీలకు ట్రాక్టర్తో పాటు ట్యాంకర్లను సమకూర్చింది. నీళ్లు పట్టేందుకు వలంటీర్లను సైతం నియమించింది. నేడు ఆ పనులేవీ జరిగినట్లు కనిపించడం లేదు. ములుగు జిల్లా కేంద్రం నుంచి గట్టమ్మ మొదలుకొని జంగాలపల్లి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా చాలా వరకు మొక్కలు ఎండిపోగా, పదుల సంఖ్యలో కొనఊపిరితో ఉన్నాయి.
పల్లె ప్రకృతి వనాల్లో బోరు బావులు ఉన్నా మొక్కలకు నీళ్లు పట్టే చర్యలు మాత్రం కరువయ్యాయి. ములుగు జిల్లా కేంద్రంతో పాటు ఇంచర్ల, శివతండా, రంగారావుపల్లి, పాల్సాబ్పల్లి, మదనపల్లి, జగ్గన్నపేట, రామచంద్రాపురం, జాకారం, దేవగిరిపట్నం, పత్తిపల్లి, కాసిందేవి పేట, అంకన్నగూడెం, సర్వాపురం, మహ్మద్గౌస్పల్లిలోని పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. హరితహారం మొక్కలకు సైతం ఇదే దుస్థితి పట్టింది.
నల్లబెల్లి, ఫిబ్రవరి 15: మండలంలో పల్లె ప్రకృతి వనాలను ధ్వంసం చేసి స్థలాలను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, పోలీసులు మిన్నకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మండలంలోని రుద్రగూడెం, నల్లబెల్లి, రామతీర్థం గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేయడంతోపాటు ఏకంగా డోజర్లతో ఇక్కడి ప్రభుత్వ స్థలాలను చదును చేసి ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. అర్వయ్యపల్లె రెవెన్యూ పరిధి శివారులోని దట్టకుంటలో సర్వే నంబర్ 29లో 5.18 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేశారు. ఈ స్థలంలోని 20 గుంటల భూమిలో సుమారు రూ.10 లక్షలు వెచ్చించి పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్థలంపై కన్నేసిన ఓ వ్యక్తి రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా డోజర్తో నెట్టి ఆక్రమించుకునేందుకు యత్నించాడు. దీనిపై పంచాయ తీ కార్యదర్శి అఖిల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్థానిక ఎంపీవో కూచన ప్రకాశ్ను వివరణ కోరగా పల్లె ప్రకృతి వనం ధ్వంసంపై పోలీసులే చూసుకుంటారని తెలిపారు. ఎస్సై నైనాల నగేష్ను అడుగగా తమ విచారణలో ఓ వ్యక్తిని గుర్తించినా సంబంధిత కార్యదర్శి అతనిపై తమకు మరో పిటిషన్ ఇస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. కలెక్టర్ స్పందించి పల్లె ప్రకృతి వనాలను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, పార్క్లను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.