హనుమకొండ, డిసెంబర్ 30 : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్ రగడ రగులుకుంది. ప్రజా పాలన కార్యక్రమంతోపాటు ఇటీవల హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్వహించిన సమావేశానికి జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఆహ్వానం పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీలకతీతంగా అందరినీ ఆహ్వానించేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన జడ్పీటీసీలు, ఎంపీపీలు సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. శనివారం హనుమకొండ జడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ మారపెల్లి సుధీర్కుమార్ అధ్యక్షతన వరంగల్ అర్బన్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికై జడ్పీ సమావేశానికి మొదటి సారి వచ్చిన కేఆర్ నాగరాజును సన్మానించారు. అనంతరం జడ్పీటీసీలు వంగ రవి, పిట్టల శ్రీలత, చాడ సరిత, కల్యాణి, సునీత, కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్ అలీషేక్, ఎంపీపీలు మార్నేని మధుమతి, సమ్మిరెడ్డి, కవిత, మేకల స్వప్న, అనిత మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తులపై ప్రజల్లో గందరగోళం నెలకొందని, ప్రజా ప్రతినిధులను సమావేశాలకు పిలిస్తే సందేహాలు నివృత్తి చేసుకొని ప్రజలకు చెప్పేవారమన్నారు. ఇటీవల కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులేనని మాట్లాడడం ప్రజాప్రతినిధులను అవమానించనట్లేనని మండిపడ్డారు.
హామీలను అమలు చేస్తాం..
ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ప్రజల అభీష్టం మేరకు ఏర్పాటైన ప్రభుత్వం వారి ఆకాంక్ష మేరకు పని చేస్తుందన్నారు. నాలుగు నెలలుగా హాస్టళ్లకు డైట్ చార్జీలు రావడం లేదని, వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఐనవోలు జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
అప్రజాస్వామికంగా ప్రజాపాలన..
ప్రజాపాలన కార్యక్రమం అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్నారని జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ విమర్శించారు. ఎన్నికల వరకే పార్టీలుగా పనిచేయాలని, ఆ తర్వాత ప్రభుత్వం, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు వస్తాయన్నారు.