రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్.. పరారీలో మరొకరు
టాస్క్ఫోర్స్ ఇన్చార్జి అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్
సుబేదారి, జూలై 12 : గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.రెండు లక్షల విలువైన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఇన్చార్జి అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముప్పారం గ్రామానికి చెందిన కందిమల్ల వేణుగోపాల్, మడికొండకు చెందిన రవికంటి చంద్ర శేఖర్, కాజీపేటకు చెందిన దేవేందర్ ఆటోలో తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. రవికంటి చంద్రశేఖర్ పరారీలో ఉన్నాడు.
పంథినిలో..
ఐనవోలు : మండలంలోని పంథిని గ్రామంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్సై గుగులోత్ వెంకన్న తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పంథిని గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు సిబ్బందితో సోదాలు నిర్వహించారు. భూస వంశీ దగ్గర నుంచి రూ. 6,640 విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. అదే విధంగా ఇదే గ్రామానికి చెందిన తమ్మి లక్ష్మీనారాయణ దగ్గర రూ.24,090 విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కా ప్యాకెట్లను అమ్మినట్లు తెలిస్తే ఐనవోలు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. సోదాల్లో పోలీసులు ఎం రాజు, హేమకుమార్, కుమారస్వామి పాల్గొన్నారు.