కరీమాబాద్, ఏప్రిల్ 21 : ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ షురూ అయింది. సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రకటన చేసిన విషయం విధితమే. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే యువతకు అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ ఇస్తుంది. మామునూరులోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో 90 రోజుల పాటు క్లాసులు నిర్వహించనున్నారు. భోజన వసతితో పాటు ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.3500 విలువైన పుస్తకాలను అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1600 మంది అభ్యర్థులు శిక్షణ పొందేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టులను బోధిస్తున్నారు. నిత్యం భోజనం అందజేస్తున్నారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఫిజికల్ ట్రైనింగ్ను ఇస్తున్నారు. యువతకు తమ అనుభవాలను, సలహాలను అందించేందుకు గాను జిల్లాకు చెందిన ఉన్నత అధికారులతో పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వందలాది మంది యువకులు మామునూరులో శిక్షణ పొందుతుంటే అది ఓ కళాశాలను తలపిస్తున్నది.
యువత సద్వినియోగం చేసుకోవాలి: అరూరి విశాల్, అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్
యువతకు అండగా నిలవాలని ఓ బృహత్ కార్యక్రమం చేపట్టాం. ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలి. 90 రోజుల పాటు ఉచితంగా నిర్వహించే శిక్షణ ద్వారా యువత ఉద్యోగాలు సాధించాలి. శిక్షణతో పాటు అన్ని వసతులను ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సేవ చేయాలనే లక్ష్యంతోనే తాత జ్ఞాపకార్థం ఫౌండేషన్ స్థాపించాం.