దేవరుప్పుల, మార్చి 21 : దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీలో మూడో రోజైన గురువారం గ్రూపు తగాదాలు తారాస్థ్ధాయికి చేరాయి. ఒకవైపు నూతన అధ్యక్షుడికి శ్రేణులు అభినందన సభ ఏర్పాటు చేయగా, మరోవైపు పెద్ది కృష్ణమూర్తి వర్గం ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పెద్ది అనుచరుడు ఉప్పుల బాబు సెల్ టవర్ ఎక్కగా, అటు మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు నల్లా శ్రీరామ్ను సన్మానించారు.
పదవి కోల్పోయిన పెద్ది కృష్ణమూర్తి అనుచరుడు, దేవరుప్పులకు చెందిన ఉప్పుల బాబు బస్టాండ్ ప్రాంతంలోని సెల్ టవర్ ఎక్కి గంటపాటు హల్చల్ చేశారు. కృష్ణమూర్తికి తిరిగి అధ్యక్ష పదవి అప్పగించాలని, ఎమ్మెల్యే యశస్విని వచ్చే వరకు టవర్ దిగేది లేదని స్పష్టం చేశాడు. ఎస్సై చెన్నకేశవులు, పోలీసు సిబ్బంది ఎంత నచ్చజెప్పినా ససేమిరా దిగనంటూ మొరాయించాడు. చివరకు పెద్దితో ఫోన్లో మాట్లాడించగా ఆయన ఆదేశం మేరకు కిందికి దిగాడు.
అభినందన సభలో నూతన అధ్యక్షుడు నల్లా శ్రీరామ్ మాట్లాడుతూ పెద్ది కృష్ణమూర్తి మీద రెండు నెలలుగా అనేక ఆరోపణలు వచ్చాయని, ఎమ్మెల్యే యశస్వినీరెడ్డితో పాటు కాంగ్రెస్ నియోజక ఇన్చార్జి ఝాన్సీరెడ్డి హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడం వల్లనే అతడిని తొలగించాల్సి వచ్చిందన్నారు. మండలంలోని 28 గ్రామాల పార్టీ అధ్యక్షులు పెద్దిని తొలగించాలని ఏకగ్రీవంగా తెలపడమే కాకుండా లిఖితపూర్వకంగా రాసిచ్చారని చెప్పారు. ఇది మింగుడుపడని పెద్ది ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కలిసి వస్తే స్వాగతిస్తామని, తాను అందరినీ కలుపుకుపోతానని ఆయ న నాయకులు, కార్యకర్తలకు తెలిపారు.
అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విషయమై పెద్ది కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి తనకు సమాచారం లేదని చెప్పారన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారని, ఆయన రాగానే కలుసుకొని దేవరుప్పుల పరిస్థితి, ఝాన్సీరెడ్డి తీరుపై ఫిర్యాదు చేస్తానని పెద్ది తెలిపారు.