వరంగల్, నవంబర్ 28: కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని బల్దియా గ్రీవెన్స్లో బాధితులు అధికారులను కోరారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. సోమవారం గ్రేటర్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నిర్వహించిన గ్రీవెన్స్లో కమిషనర్ ప్రావీణ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా డివిజన్లలోని ప్రజలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. గ్రీవెన్స్లో అత్యధికంగా అక్రమ నిర్మాణాలు, రహదారుల ఆక్రమణలపై 53 ఫిర్యాదులు అందాయి. రోడ్లు, డ్రైనేజీల సమస్యలను పలువురు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
వరంగల్ ఎల్బీనగర్లోని భవానీ కారా ఫ్యాక్టరీ వెనుకాల గిర్మాజీపేట రజకులకు దోబీ ఘాట్ కోసం, దుస్తులు ఆరేసేందుకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఖాళీ చేయించి రజకుల కోసం ఆధునిక దోబీ ఘాట్ నిర్మించాలని గిర్మాజీపేట రజకుల సంఘం ఆధ్వర్యంలో కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. కరీమాబాద్ దసరా రోడ్డు వెంట నిర్మాణం చేపట్టాలని దసరారోడ్డు ప్రజలు కమిషనర్ను కోరారు. మిషన్ భగీరథ పైపులైన్ పేరుతో రోడ్డును తవ్వారని, రోడ్డుపై మట్టికుప్పలు తొలగించకపోడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.
వరంగల్ బస్స్టేషన్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలాన్ని కొంతమంది ఆక్రమించి తాత్కాలిక డబ్బాలు ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారని నాయకులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. బల్దియా గ్రీవెన్స్లో మొత్తంగా 87 వినతులు వచ్చాయి. టౌన్ప్లానింగ్ విభాగానికి 53, ఇంజినీరింగ్ విభాగానికి 12, తాగునీటి సరఫరా 5, ప్రజారోగ్యం, శానిటేషన్ 6, పన్నుల విభాగానికి 11 వినతులు వచ్చా యి. గ్రీవెన్స్లో అదనపు కమిషనర్ రవీందర్యాదవ్, ఇన్చార్జి ఎస్ఈ రాజయ్య, సీఎంహెచ్వో డాక్టర్ రాజయ్య, సిటీ ప్లానర్ వెంకన్న, సీహెచ్వో శ్రీనివాసరావు, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రషీద్, శ్రీనివాస్రెడ్డి, జోనా పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
పెండింగ్ బిల్లులు చెల్లించాలని బల్దియా సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు కమిషనర్ ప్రావీణ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. నెలల తరబడి బిల్లులు ఆగిపోయాయని తెలిపారు. లక్షల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు కమిషనర్కు విన్నవించారు. బిల్లుల చెల్లింపులు జరుపకపోవడంతో పనులు చేయలేకపోతున్నామని వాపోయారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు వారు చెప్పారు.