వరంగల్, మార్చి 27 : కాలనీల్లో వసతులు కల్పించాలని గ్రేటర్ ప్రజలు కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో వివిధ సమస్యలపై వినతులు సమర్పించారు. 41వ డివిజన్ కాశీకుంట పోచమ్మ ఆలయ పక్కన ఉన్న ఆరె కటిక శ్మశానవాటిక పనులను వేగవంతం చేయాలని ఆరె కటిక సేవా పరపతి సంఘం అధ్యక్షుడు గోగికార్ రవీందర్ అధికారులను కోరారు. రామన్నపేటలో నల్లా పైపులైన్ లీకేజీ ఉందని, వెంటనే మరమ్మతు చేయాలని సంతోష్కుమార్ వినతి పత్రం అందజేశారు. పోతన శ్మశానవాటికలో కనీస వసతులు కల్పించాలని సందెల దామోదర్ కోరారు.
ఇంటి నిర్మాణ అనుమతుల కోసం చెల్లించిన రుసుమును తిరిగి అందజేయాలని బాధితుడు కుమారస్వామి కోరారు. గ్రీవెన్స్లో మొ త్తంగా 60 వినతులు రాగా, టౌన్ప్లానింగ్ విభాగానికి 31, తాగునీటి సరఫరా విభాగానికి 9, ఇంజినీరింగ్ విభాగానికి 6, ప్రజారోగ్యం, శానిటేషన్కు 2, పన్నుల విభాగానికి 9, హార్టికల్చర్ విభాగానికి 3 వచ్చినట్లు అధికారులు తెలిపారు. గ్రీవెన్స్లో అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ అనీసుర్ రషీద్, ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, సీహెచ్వో శ్రీనివాసరావు, బయాలజిస్ట్ మాధవరెడ్డి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.