వరంగల్, నవంబర్ 28: ఆచార్య చందా కాంతయ్య గొప్ప సంఘ సంస్కర్త అని ఏవీవీ కళాశాల పూర్వ విద్యార్థి, రోహిణి వైద్యశాల చైర్మన్ డాక్టర్ బుచ్చిరెడ్డి అన్నారు. ఏవీవీ కళాశాల వ్యవస్థాపకుడు ఆచార్య చందా కాంతయ్య జయంతిని ఆదివారం కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ బుచ్చిరెడ్డి హాజరై చందా కాంతయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో ముందుచూపుతో నగరంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని కొనియాడారు. కళాశాలలో నూతన భవన నిర్మాణానికి తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రముఖ కవి ప్రొఫెసర్ రామా చంద్రమౌళి మాట్లాడుతూ చందా కాంతయ్య జీవితం భావితరాలకు ఆదర్శనీయం అన్నారు. ఏవీవీ విద్యాసంస్థల పాలకవర్గ సభ్యుడు ప్రొఫెసర్ ఎస్ఎస్వీఎస్ శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏవీవీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ చందా విజయకుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ బొమ్మినేని రవీందర్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ భుజేందర్రెడ్డి, చందా శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు మడూరి వేద ప్రకాశ్, డాక్టర్ నారాయణరెడ్డి, వాసుదేవులు, గముడవెళ్లి సత్యనారాయణ, శ్రీనివాస్, మీనేశ్వర్రావు, రమణ, రఘపతి పాల్గొన్నారు.
సీకేఎం దవాఖానలో వేడుకలు
వరంగల్ చౌరస్తా: చందా కాంతయ్య జయంతిని సీకేఎం దవాఖానలో ఘనంగా నిర్వహించారు. సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశిధర్రావు, కార్యదర్శి చందా విజయ్కుమార్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రధాన తపాలా కార్యాలయం సెంటర్, సీకేఎం దవాఖానలోని కాంత య్య విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీకేఎం దవాఖానలో వైద్య సేవలు పొందుతున్న మహిళలకు పండ్లు పంపిణీ చేశారు. వరంగల్ నగరంలో విద్యా, వైద్యానికి ప్రాధాన్యాన్ని కల్పించడంలో చందా కాంతయ్య విశేష కృషి చేశారని వారు కొనియాడారు. కార్యక్రమంలో సీకేఎం వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు.