మల్లన్న జాతరకు వచ్చే భక్తులకు స్వాగత తోరణాలు గ్రాండ్ వెల్కం పలుకనున్నాయి. ఈ నెల 16 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, స్వాగతం పలికేందుకు ఆర్చ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వాటికి ఇరువైపులా గోడ మీద వేసిన శివుడి ప్రతిరూపాలతో ఆధ్మాత్మిక శోభ ఉట్టిపడనుంది. అలాగే దాతల సహకారంతో ఆలయ ఆవరణలో నిత్యాన్నదాన సత్రం నిర్మిస్తుండగా, పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. భక్తుల విడిది కోసం 8 వసతి గదులూ సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ జాతర సమయానికి అందుబాటులోకి రానున్నాయి. ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.10 కోట్ల వరకు కేటాయించగా పక్కా ప్రణాళికతో పనులు చేస్తున్నారు.
– ఐనవోలు, డిసెంబర్ 12
పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ నాయకత్వంలో, డీసీసీబీ చైర్మన్ మార్నేని చొరవతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏడాది మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 16 దృష్టికుంభం కార్యక్రమంతో మొదలై ఉగాది వరకు కొనసాగనుంది. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు గ్రాండ్ వెల్కం పలికేందుకు ఆలయం, ఆవరణ సిద్ధమవుతోంది.
ఐనవోలు ఆలయాభివృద్ధిలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గుడికి చుట్టూ సుమారు15 ఎకరాలకు ఎర్ర రాతితో ప్రహరీ రూ. కోటితో నిర్మించారు. నాలుగు చోట్ల ఐమాక్స్ లైట్ల టవర్లకు సుమారు రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఎంట్రన్స్ రెండు స్వాగత తోరణాలకు ఇరువైపులా గోడను రూ.60 లక్షలతో పూర్తి చేశారు. దానిపై వేసిన శివుడి ప్రతిరూపాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. డార్మెటరీ హాల్కు రూ.2 కోట్ల కేటాయించగా, నిర్మాణం వ్యయం పెరగడంతో అతి త్వరలో మరిన్ని నిధులు మంజూరు చేయనున్నారు.
ఆలయ ఆవరణలో దేవాలయ నిధులతో నూతనంగా జీ ప్లాస్ వన్లో రూ. కోటీ 25 లక్షల వ్యయంతో ఈవో కార్యాలయం, చైర్మన్ చాంబర్, సమావేశ హాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎల్లమ్మ దేవాలయం పునర్ నిర్మాణ కోసం రూ.50 లక్షల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఆలయంలో భక్తులకు విడిది కోసం వసతి గదుల సమస్య ఉంది. గతంలో దాతలు కట్టించినవి కొంత మేరకు ఉపయోగపడగా, అవి శిథిలావస్థకు చేరుకోవడంతో సుమారు 13 గదులను కూల్చివేశారు. ఈ క్రమంలో ఈవో ప్రత్యేక చొరవతో ఆలయం పడమర (వెనుక) వైపున మల్లన్న సదన్లో 45 వసతి గృహాల నిర్మాణం కోసం దాతల సహకారం కోరారు. దీంతో కొంత మంది ముందుకు వచ్చి మొదటి అంతస్తు నిర్మించారు. అందులో 8 వసతి గదులు ఈ జాతర బ్రహ్మోత్సవాలకు అందుబాటులోకి రానున్నాయి.
కరోనా తర్వాత ఎటువంటి ఆంక్షలు లేకుండా జరుగనున్న మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు గ్రాండ్ వెల్కం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అటు ప్రభుత్వం, ఇటు దాతల సహకారంతో మల్లన్న సదన్లో వసతి గదులు, అన్నదాన సత్రం నిర్మాణం పూర్తి కావొస్తున్నాయి. భక్తులకు క్యూలైన్లలో ఇబ్బంది కలుగకుండా జాలీలు బిగించాం. అతి పురాతన చరిత్ర కలిగిన ఆలయానికి మహా కుంభాభిషేకం జరిగిన తర్వాత మొదటి జాతర బ్రహోత్మవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నాం. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
– అద్దంకి నాగేశ్వర్రావు, ఈవో
భక్తుల సౌకర్యార్థం దాతలు దుపల్లి గోపీకృష్ణ, వంశీకృష్ణ తండ్రి మల్లికార్జున్రావు జ్ఞాపకార్థం నిత్యాన్నదాన సత్రం నిర్మిస్తున్నారు. వీటి పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయి. ఈ నెల 30న అన్నదాన సత్రం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇది పూర్తయితే నిత్యాన్నదానం చేసే దాతలకు, అన్నదానంలో పాల్గొనే భక్తులకు ఎంతగానో ఉపయోగపడనుంది. దాత సహకారంతో రూ.15 లక్షల వ్యయంతో అద్దాల మండపం, రూ. 5 లక్షలతో కోనేరు, రాజగోపురం, కల్యాణ మండపం నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు.