వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 5: ప్రపంచంలోనే డాక్టర్ వృత్తికి ప్రత్యేక గౌరవం ఉందని ప్రముఖ కార్డియాలజిస్ట్ కస్తూరి శ్రీధర్ అన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీలో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య విద్య పూర్తి చేసుకున్న 250 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఆయుష్షు పెంచే శక్తి ఒక్క వైద్యులకు మాత్రమే ఉందన్నారు.
కరోనా కాలంలో విద్యనభ్యసిస్తూ, కఠినమైన పరిస్థితుల్లో వైద్య సేవల్లో పాలుపంచుకున్న ఈ బ్యాచ్ విద్యార్థులు కరోనా ఫైటర్స్గా పేరొందారని కితాబిచ్చారు. కేఎంసీలో తాను చదివిన రోజులు, ఎంజీఎం హాస్పిటల్తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం కేఎంసీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లో ఆనందోత్సాహాల మధ్య విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్రావు, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఆర్ఎంవో భరత్కుమార్ పాల్గొన్నారు.