హనుమకొండ, నవంబర్ 29 : అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-2 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిరు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులు సోమవారం విధుల్లో చేరారు. జిల్లాలో 8 మందికి పోస్టింగ్ ఇవ్వడంతోపాటు ప్రాజెక్టులు, సెక్టార్లను కేటాయించారు. ఈ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. గత సంవత్సరం నవంబర్లో ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరం జనవరి నెలలో రాత పరీక్ష నిర్వహించి అందులో అర్హులైన వారిని జాబితాను విడుదల చేసింది. ఈ జాబిత, ఎంపిక విషయంలో కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో నియామక ప్రక్రియ నిలిచిపోయిందని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో కోర్టు వివాదం పరిష్కారమైంది. దీంతో గ్రేడ్ -2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయని అధికారులు చెప్పారు. కాగా, కొత్తగా ఎంపికైన వారు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో రిపోర్టు చేసి విధుల్లో చేరారు. కాగా, గ్రేడ్ -2 సూపర్వైజర్గా ఎంపికైన అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మూడు ప్రాజెక్టులు..
జిల్లాలోని హనుమకొండ, భీమదేవరపల్లి, పరకాల మూడు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 789 అంగన్వాడీ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 8 గ్రేడ్ -2 సూపర్వైజర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. హనుమకొండ జిల్లా నుంచి ఐదుగురు, కరీంనగర్ జిల్లా నుంచి ఒక్కరు, మహబూబాబాద్ జిల్లా నుంచి ఒక్కరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఒక్కరు చొప్పున ఎంపికైన వారిని హనుమకొండ జిల్లాకు కేటాయించారు. జిల్లాలోని హనుమకొండ ప్రాజెక్టు పరిధిలో విధులు నిర్వర్తిస్తూ గ్రేడ్ -2 సూపర్వైజర్గా ఎంపికైన తూముల సుజాతను భీమదేవరపల్లి ప్రాజెక్టుకు కేటాయించారు. అలాగే, కరీనంగర్ జిల్లా గంగాధర ప్రాజెక్టులో విధులు నిర్వర్తిస్తూ గ్రేడ్ -2 సూపర్ వైజర్గా ఎంపికైన ఎం రేణుకను భీమదేవరపల్లి ప్రాజెక్టు, మహబూబాబాద్ ప్రాజెక్టు పరిధిలో విధులు నిర్వర్తిస్త్తూ గ్రేడ్ -2 సూపర్వైజర్గా ఎంపికైన మామిడి జ్యోతిని హనుమకొండ ప్రాజెక్టుకు, పరకాల ప్రాజెక్టులో విధులు నిర్వర్తిస్తూ గ్రేడ్ -2 సూపర్వైజర్గా ఎంపికైన కందుల శ్రీదేవిని హనుమకొండ ప్రాజెక్టుకు, కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కత్తుల రజితను హనుమకొండ ప్రాజెక్టుకు, పరకాల ప్రాజెక్టులో పనిచేస్తున్న జంగం రాణిని పరకాల ప్రాజెక్టు కేటాయించారు. అదే విధంగా భీమదేవరపల్లి ప్రాజెక్టులో పనిచేస్తున్న మహేశ్వరపు రోజారాణిని పరకాలకు, మడికొండ మహిళా ప్రాంగణంలో పనిచేస్తున్న ఇన్స్ట్రక్టర్ జే మంజులను పరకాల ప్రాజెక్టుకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.