పోచమ్మమైదాన్, ఏప్రిల్ 10 : గుడిసె వాసులందరికీ పట్టాలు అందించే జిమ్మెదారి తనదేనని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేన నరేందర్ అన్నారు. 58,59 జీవోలపై సోమవారం వరంగల్ దేశాయిపేటలోని ఎన్పీఆర్ నగర్ కాలనీ, 12వ డివిజన్లోని కేఎల్ మహేంద్రనగర్ కాలనీలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాలనీల్లో విద్యుత్, తాగునీరు, ఇంటి నంబర్లు, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. గుడిసెవాసులకు ఉన్న అపోహలు తొలగించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కావటి కవిత, జీవోల నిర్వహణ బాధ్యులు మర్రి శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, నాయకులు ప్రవీణ్, సురేశ్, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.
గిర్మాజీపేటలో..
గిర్మాజీపేట : గుడిసెవాసుల కళ్లల్లో ఆనందమే లక్ష్యంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అతి త్వరలోనే పట్టాలు అందిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. 33వ డివిజన్లోని సీఆర్నగర్కాలనీ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ అధ్యక్షతన జీవో 58,59లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 3,800 కోట్లతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత ముష్కమల్ల సుధాకర్, సోమిశెట్టి ప్రవీణ్, డివిజన్ అధ్యక్షుడు మీరిపల్లి వినయ్కుమార్, కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్ పాల్గొన్నారు.
రైస్మిల్ పరిశీలన..
కరీమాబాద్ : అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని కరీమాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న విశ్వేశ్వర రైస్మిల్లో షార్ట్ సర్క్యూట్తో ధాన్యం సహా పలు రకాల వస్తువులు దగ్ధమయ్యాయి. ఎమ్మెల్యే నన్నపునేని సోమవారం రైస్మిల్ను పరిశీలించారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ పల్లం రవి, మోడెం ప్రవీణ్ ఉన్నారు.