ఖిలావరంగల్, సెప్టెంబర్ 21: సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కావాల్సిన కోర్సులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు. బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం ఏటా అందించే ప్రోత్సాహక నగదు పురస్కార కార్యక్రమానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వల్ల తెలంగాణకు అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. అమేజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలు రెండో బ్రాంచ్లను హైదరాబాద్, వరంగల్లో స్థాపిస్తున్నారని తెలిపారు.
గడిచిన ఐదేళ్లల్లో ఐటీ రంగంలో రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉంటూనే ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కళాశాల సెక్రటరీ సీహెచ్ దేవేందర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు వాగ్దేవి విద్యా సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 297 మంది విద్యార్థులకు రూ. 2.60 కోట్ల ప్రోత్సాహక నగదు బహుమతులు అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రకాశ్రావు, డీన్ శశిధర్, ఎస్ఎస్వీ శర్మ, డైరెక్టర్ వాణిదేవి, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతిరావు పాల్గొన్నారు.