మహిళలు, పిల్లల రక్షణపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. లైంగిక దాడులు, వేధింపులకు గురైన వారికి అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా భరోసా కేంద్రాలను నెలకొల్పింది. జెమిని ఎడిబుల్, ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) కింద అందించిన రూ.2.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పాత సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మహిళా పోలీసు స్టేషన్ ప్రాంతంలోని 12 గుంటల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి భవన నిర్మాణానికి 2022 నవంబర్ 25న భూమి పూజ చేశారు. పది నెలల్లోనే భవనం పూర్తయింది. ఈ కేంద్రంలో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కౌన్సెలింగ్, లీగల్ కౌన్సెలింగ్, సపోర్టు పర్సన్, మెడికల్ ఎగ్జామినేషన్, కాన్ఫరెన్స్, సపోర్టు స్టాఫ్, డైనింగ్, రికార్డు, స్టోర్ రూములు ఉండనున్నాయి
వరంగల్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహిళలు, పిల్లల కోసం మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రణాళికను ఆచరణలోకి తెచ్చింది. మహిళలు, పిల్లలకు చట్టపరంగా రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ సపోర్టు సెంటర్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్(భరోసా)కేంద్రానికి ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించింది. అత్యాధునిక హంగులతో అర ఎకరం విస్తీర్ణంలో భరోసా కొత్త భవనం ముస్తాబవుతున్నది. జెమిని ఎడిబుల్, ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్(సీఎస్ఆర్) కింద అందిస్తున్న రూ.2.50 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాత సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మహిళా పోలీసు స్టేషన్ ప్రాంతంలోని అర ఎకరం స్థలాన్ని కేటాయించింది. 12 గుంటల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టింది. జీ ప్లస్ వన్ పద్ధతిలో ఈ భవన నిర్మాణం పూర్తయింది.
17 రూములు, 20 మంది సమావేశమయ్యేలా హాల్తోపాటు బాధితులకు వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్, న్యాయ సేవలు, పోలీసు విచారణ కోసం వేర్వేరుగా రూములు ఉంటాయి. లైంగిక దాడి, పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే బాధితులకు సత్వర స్వాంతన, న్యాయ సేవలు అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 9 భరోసా కేంద్రాలు ఉన్నాయి. 2020 జూన్లో వరంగల్ పోలీసు కమిషరేట్ పరిధిలో భరోసా కేంద్రం సేవలు మొదలయ్యాయి. భరోసా కేంద్రానికి అత్యాధునిక హంగులతో సొంత భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి భరోసా కేంద్రం భవన నిర్మాణానికి 2022 నవంబర్ 25న భూమి పూజ చేశారు. పది నెలల్లోనే భవనం పూర్తయింది. ఈ కేంద్రంలో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కౌన్సెలింగ్, లీగల్ కౌన్సెలింగ్, సపోర్టు పర్సన్, మెడికల్ ఎగ్జామినేషన్, కాన్ఫరెన్స్, సపోర్టు స్టాఫ్, డైనింగ్, రికార్డు, స్టోర్ రూములు ఉన్నాయి.
పని ఇలా..
భరోసా కేంద్రంలో మహిళా ఇన్స్పెక్టర్, సైకాలజిస్టు, సపోర్టు పర్సన్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్, అకౌంటెంట్, రిసెప్షనిస్టు ఉంటారు. మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీటీమ్స్ సేవలు ఈ భవనం నుంచే అందించేలా పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. బాధితులకు భరోసా కల్పించే కేంద్రాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వీటికి ఈ పేరు పెట్టింది. లైంగిక దాడులు, ఇతర వేధింపులకు గురైన పిల్లలు, మహిళల మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భరోసా కేంద్రాల్లో సేవల నిర్వహణ తీరు ఉంటుంది. పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాగానే బాధితులను నేరుగా భరోసా కేంద్రానికి పంపిస్తారు. అక్కడ పోలీసు స్టేషన్ తరహా వాతావరణం ఉండదు. బాధితులకు స్వాంతన కలిగించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. వారిలో మనోధైర్యం కల్పించేందుకు సైకాలజిస్టు ఉంటారు. బాధితులకు అన్ని రకాలుగా ధైర్యం చెప్పేలా మరో సపోర్టింగ్ పర్సన్ సేవలు అందిస్తారు. బాధితుల గురించి ఇతరులకు తెలియకుండా వారు మానసికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. వైద్య సేవలు, పరీక్షల నిర్వహిస్తారు. వేగంగా న్యాయ సేవలు అందించేలా భరోసా కేంద్రంలో న్యాయవాదులు అందుబాటులో ఉంటారు. బాధితులు కోరిన ప్రకారం వారికి న్యాయ సేవలు అందిస్తారు.
అభయం..
వరంగల్ పోలీసు కమిషనరేట్ భరోసా కేంద్రం ఎంతో మందికి అండగా నిలిచింది. ఈ కేంద్రంలో సేవలు మొదలైనప్పటి నుంచి 606 కేసులు నమోదయ్యాయి. వీటిలో 396 పోక్సో కేసులు, 149 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. 61 ఐపీసీ 363 సెక్షన్ కేసులు ఉన్నాయి. భరోసా కేంద్రం ద్వారా 342 మంది బాధితులకు రూ.1.20 కోట్లను పరిహారంగా అందజేశారు. ఎనిమిది మందికి తాత్కాలిక పరిహారంగా రూ.14.54 లక్షలను ఇచ్చారు. మరో 33 మంది బాధితులకు సాయంగా మరికొంత మొత్తాన్ని అందజేశారు.