వరంగల్ చౌరస్తా, నవంబర్ 28 : వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఎల్వీఆర్ నగర్ను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం కాలనీలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన చిన్నతనంలో ఎల్వీఆర్నగర్ వాసులు పడిన ఇబ్బందులు నేటితరం పడకూడదన్న ఆశయంతో కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. తాను సైతం పేదరికంలో పుట్టి పెరిగానని, అద్దె ఇంటి కష్టాలను సైతం అనుభవించానని గుర్తు చేశారు. మేయర్గా ఉన్న సమయంలోనే ఎల్వీఆర్ నగర్ వాసులు తనను కలిశారని, వెంటనే అధికారులతో మాట్లాడి వసతులు కల్పించాలని ఆదేశించానన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రజల కష్టాలను తీర్చడానికి కేసీఆర్, కేటీఆర్ల అడుగు జాడల్లో ముందుకు నడుస్తానన్నారు. త్వరలోనే అన్ని ఇళ్లకు కరెంటు మీటర్లు, రోడ్డు సౌకర్యం, మురుగు నీటి కాల్వల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, దుబ్బ శ్రీనివాస్, చిలుక రాజు తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి శోభాయాత్రకు ఏర్పాట్లు..
కరీమాబాద్ : ఉర్సులో నిర్వహించే అయ్యప్ప స్వామి శోభాయాత్ర, మహాపడి పూజకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం ఉర్సులోని అయ్యప్పస్వామి కుటీరంలో ఉత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 5న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి శోభాయాత్రకు బందోబస్తు ఏర్పాట్లు చేయిస్తానన్నారు. డిసెంబర్ 12న జరిగే మహా పడిపూజకు బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్, కార్పొరేటర్లు పోశాల పద్మ, మరుపల్ల రవి, కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, నాయకులు పోశాల స్వామి, కర్ర కుమార్, ఈదుల రమేశ్, ఈదుల భిక్షపతి, పాల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
నాగేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తా..
నాగేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఉర్సులోని నాగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులతో ఆలయంలో పూర్తిస్థాయి వసతులు కల్పిస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఈవో వేణుగోపాల్, ఆలయ కమిటీ డైరెక్టర్లు బజ్జూరి రవి, వాడిక విద్యాసాగర్, గుడిమెల్ల రాజు, గుండాల కవిత, ఆలయ ప్రధాన పూజారి శ్రీరామ్శర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే శివనగర్లోని సీపీఐ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నన్నపునేని మొక్కలు నాటారు.