కాజీపేట, ఆగస్టు 26 : రాష్ట్రంలోని బీసీలు, కులవృత్తులకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట 61వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి చెరువులో సమీకృత మత్స్యశాఖ అభివృద్ధి పథకంలో భాగంగా శనివారం చేప పిల్లలను ఆయన విడుదల చేశారు. అనంతరం జిల్లా మత్య్సశాఖాధికారి విజయ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్విప్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. చెరువుల్లో చేపలు వదలడంతో సత్ఫలితాలు వచ్చి నీలి విప్లవం వైపు బాటలు పడుతున్నాయన్నారు.
2016లో సీఎం కేసీఆర్ ఓ మహోన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో నేడు ఇతర రాష్ర్టాలు హర్షించేలా ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఔట్లెట్లు ఏర్పాటు చేసి, తెలంగాణ బ్రాండ్ పేరుతో చేపల విక్రయాలు, వంటకాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం వడ్డేపల్లి చెరువులో 3.60లక్షల చేప పిల్లలను విడుదల చేశామని తెలిపారు. పట్టణంలో, చెరువుల సమీపంలో చేపలను మహిళలు అమ్ముకునేలా త్వరలో మత్స్యశాఖ అధికారుల సమన్వయంతో స్థలం చూపడంతో పాటు షెడ్డులను ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న జిల్లా మత్స్యకారుల కార్యాలయ భవనాన్ని ఏర్పాటు చేయిస్తానన్నారు. సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తనను త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ అధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎలకంటి రాములు, దాస్యం అభినవ్ భాస్కర్, మత్స్య సొసైటీ జిల్లా అధ్యక్షుడు బుస్సా మల్లేశం, నాయకులు పులి రజినీ కాంత్, సంచు కృష్ణ, శ్రవణ్కుమార్, వడ్డేపల్లి సొసైటీ బాధ్యులు పాల్గొన్నారు.
మదర్ థెరిసాకు నివాళి
పేద ప్రజలు, అభాగ్యుల సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మదర్ థెరిసా జయంతిని పురస్కరించుకుని ఫాతిమా జంక్షన్లోని ఆమె విగ్రహానికి చీఫ్విప్ పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కెథడ్రల్ చర్చి ఫాదర్ కాసు మర్రెడ్డి, థెరిసా విగ్రహ కమిటీ కన్వీనర్ రాజమోహన్రావు, టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్, బొక్కా దయాసాగర్, టీడీ టామి, మథ్యూస్ రెడ్డి, ప్రకాశ్రెడ్డి, ఎంజీ ప్రకాశ్, పోలిమేర సృజన్ కుమార్, భాస్కర్, ప్రభాకర్, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
కార్మికులకు అండగా ఉంటా
సంఘటిత, అసంఘటిత కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. అసంఘటిత కార్మికులకు కాజీపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్భాస్కర్ ఆధ్వర్యంలో ఉచిత కార్మిక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చీఫ్విప్ పాల్గొని మాట్లాడుతూ అర్హూలైన కార్మికులు తప్పని సరిగా లేబర్ కార్డు పొందాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు సాంబరాజు అంకయ్య, నాగవెళ్లి సమ్మయ్య, తీగల ఎల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు నార్లగిరి రమేశ్, మిట్టపల్లి రవీందర్, కాటాపురం రాజు, మహ్మద్ సోని, మహమూద్, రాంచందర్, మర్యాల కృష్ణ, మైలారం శంకర్, ప్రణయ్ పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
కాజీపేట 47వ డివిజన్లోని ఇంపీరియల్ కాలనీలో స్థానికుల ఆధ్వర్యంలో జరిగిన పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో చీఫ్విప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలనీ మహిళలు, ప్రజలు ఆయనకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, నాయకులు శిరుమల్ల దశరథం, గబ్బెట శ్రీనివాస్, సిరిల్ లారెన్స్, తండమల్ల వేణు, రామస్వామి, శంకర్, బండి రాంచందర్, శేఖర్, ప్రసాద్, సోనీ, అఫ్జల్, బోల్లె కుమార్, బొట్టు రాజు పాల్గొన్నారు.
కార్యకర్తలను కాపాడుకుంటా
అభివృద్ధిపై చర్చకు సిద్ధం ప్రతిపక్షాలకు సవాలు విసిరిన చీఫ్ విప్ దాస్యం
హనుమకొండ : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ తనకు ఎలాంటి వ్యాపారం లేదని, ప్రజల కోసం నిరంతరం శ్రమించడమే ఆత్మ సంతృప్తి అన్నారు. ప్రతిపక్షాలు తనను విమర్శించడానికి ఎలాంటి అవకాశం లేదన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. 2014 కంటే ముందు నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చేవి? ఇప్పుడు ఎన్ని వస్తున్నాయో ప్రజలందరికీ తెలుసన్నారు. ఒకప్పుడు రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉండేదన్నారు. ఇప్పుడు ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్లు తెలిపారు. ఒకప్పుడు నగరంలో నాలుగు పారులు ఉంటే ఇప్పుడు 66 పారులు ఉన్నాయన్నారు. ఈ వంద రోజులపాటు అందరూ కష్టపడి పనిచేయాలని కోరారు.
సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేసే ప్రతిపక్షాలకు దీటుగా సమాధానాలు ఇవ్వాలన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దన్నారు. ఎన్నికల్లో సైతం ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎలాంటి పనులు చేయాలో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదన్నారు. సోమవారం విష్ణు ప్రియ గార్డెన్స్లో జరిగే సమావేశంలో ముఖ్యనాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వచ్చే నెల ఒకటి నుంచి అందరూ కాలనీల్లో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్సింగ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ఇన్చార్జీలు, అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.