నయీంనగర్, జనవరి 3 : విద్యతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్హాల్లో వీసీ రమేశ్ అధ్యక్షతన సావిత్రిబాయిపూలే జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తో కలిసి సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తోందని, మహిళా రిజర్వేషన్లు సక్రమంగా అమలవుతున్నాయని అన్నారు. పూలే దంపతుల జీవిత చరిత్రపై మరిన్ని పరిశోధనలు, అధ్యయనం నిరంతరం జరుగాలని, అప్పుడే మహిళా సమస్యల పరిషారానికి మార్గాలు దొరుకుతాయని చెప్పారు.
కేజీ టు పీజీ గొప్ప కార్యం : నన్నపునేని
జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల నుంచి ప్రతిభ గల విద్యార్థులు బయటకు వస్తున్నాయని, కేజీ టు పీజీ గొప్ప కార్యమని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా చైతన్యాన్ని కోరుతోందని, విద్యార్థినులు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆడిటోరియంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావుపూలే సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రాన్ఫర్మేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు నాగేంద్ర బాబు, మనోహర్, మల్లారెడ్డి, గుండాల మదన్కుమార్, చంద్రమౌళి, కొట్టే భాస్కర్ పాల్గొన్నారు.