హనుమకొండ చౌరస్తా, మే 11: సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేనివిధంగా కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ, కార్మికుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో కార్మిక, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కార్మికుల క్రీడాపోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీఫ్ విప్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వారి కోసం అన్ని జిల్లాల్లో కార్మిక భవనాలు నిర్మిస్తున్నారని చెప్పారు. కార్మికుల కోసం మే నెల మొత్తం కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, అందులోభాగంగా కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. చాలామంది కార్మికులు అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించామని, కొంతమందికి మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పారు. క్రీడలు ఆరోగ్యానికి, శారీరక, మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నారు. కార్మికులు క్రీడల్లో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. క్రీడాకారులతో పాటు కార్మికులను కూడా క్రీడల్లో ప్రోత్సహించి ఉత్సాహాన్ని నింపిన ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అజీజ్ఖాన్ను అభినందించారు. కార్మిక మాసోత్సవ కోఆర్డినేటర్ పుల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల పక్షపాతి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ కార్మికులకు అండగా ఉంటూ, మే నెల కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. కార్మికులు ప్రతిరోజూ క్రీడల్లో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.
ఇక్కడ పని కోసం వలస వచ్చిన ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. యూపీకి చెందిన కార్మికులు గురువారం జేఎన్ఎస్లో వినయ్భాస్కర్ను కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన కార్మికులకు చీఫ్ విప్ వినయ్భాస్కర్ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అజీజ్ఖాన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సామ్యేల్ జాన్సన్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ప్రసాద్, కోచ్లు, కార్మికులు పాల్గొన్నారు.