న్యూశాయంపేట, సెప్టెంబర్ 26 : తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం గ్రేటర్ 31వ డివిజన్ పద్మాక్షి రోడ్డులో మంగళవారం ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ పసునూరు దయాకర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, నగర కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, కార్పొరేటర్ మామిండ్ల రాజుతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాట యోధుల పేర్లు చెబితే పాలకులు మండిపడేవారన్నారు. ఐలమ్మ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించి, రాష్ర్టాన్ని సాధించారన్నారు. భావితరాలకు ఐలమ్మ చరిత్ర తెలిసేలా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, పోరాట యోధులను సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటోదన్నారు. ఆత్మగౌరవంతో పాటు, ఆర్థికంగా అన్ని కులాల వారికి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోనే చాకలి ఐలమ్మకు తగిన గుర్తింపు వచ్చిందన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ మరుగునపడ్డ కుల వృత్తులను వెలుగులోకి తెస్తూ ప్రోత్సహిస్తున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చీకటి శారద ఆనంద్, మానసా రాంప్రసాద్, బస్వరాజు కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పులి రజినీకాంత్, ప్రసాద్, రజక సంఘం సభ్యులు అంకన్న, భిక్షపతి, రమేశ్, రాంచదర్ పాల్గొన్నారు.