హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: సీఎం కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రికి ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలు అందజేశారు. ఉదయం మంగళవాయిద్యసేవ, గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 21 రకాల ప్రకృతి సహజమైన పత్రులు, లక్షతులసి దళాలతోస్వామివారిని వరసిద్ధి వినాయకుడిగా అలంకరించారు. మూషిక వాహనంపై ప్రతిష్ఠించి వాహన సేవ నిర్వర్తించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ చారిత్రక వేయిస్తంభాల దేవాలయాన్ని ఆధ్యాత్మికంగా వెలుగొందేవిధంగా అభివృద్ధి చేస్తున్నామని, 30 సంవత్సరాలుగా దేవాలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటున్నానని చెప్పారు.
భక్తుల కోరికలను నెరవేర్చే ఆ రుద్రేశ్వరస్వామిని పూజించడం వలన తనకు అనేకమైన సమస్యలు పరిష్కారమైనట్లు గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, సీఎం కేసీఆర్ చొరవతో కల్యాణమండప పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగడం పట్ల హర్షం ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ 8 తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాడవాడన వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలను సరిగా నిర్వహించలేదని చెప్పారు. అందరిలో చైతన్యం వచ్చింది, ప్రతి ఒకరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్ ప్రజలు రైతులు, సబ్బండ వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నుంచి ప్రజలను రక్షించాలని, దీర్ఘకాలిక వ్యాధులు నశించాలని, శీఘ్రకార్యసాధకుడైన, ప్రకృతివరపురుషుడైన ఆ మహాగణపతిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే, హనుమకొండ బస్ డిపో సమీపంలోని మండపంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు గట్టు మహేశ్బాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్రావు, వైదిక కార్యక్రమాల నిర్వాహకులు గంగు ఉపేంద్రశర్మ, ప్రణవ్, మణికంఠశర్మ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతినిత్యం గణపతికి అభిషేకాలు, అలంకారాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉత్తిష్ఠ గణపతిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం ఎం రుద్రవేణు శిష్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అందరినీ అలరించాయి.