వరంగల్, మార్చి 14 : ఇన్నిరోజులూ మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన అత్యాధునిక కార్లు ఇప్పుడు ఓరుగల్లులో దర్శనమివ్వనున్నాయి. బ్రాండెడ్ కంపెనీల హైరేంజ్ కార్లు కొనాలనుకునేవారికి ఇక్కడే సువర్ణావకాశం రాబోతున్నది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా పేరున్న వరంగల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో నగరంలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించే ‘ఆటో షో’లో ప్రముఖ కార్ల కంపెనీలు పాల్గొంటున్నాయి. ఒకే వేదికపై సరికొత్త మోడళ్లను ప్రదర్శించనున్నాయి. ఇప్పటి వరకు వరంగల్ మహా నగరంలో షోరూంలు లేని ఆడీ క్యూ త్రీ, వోల్వో ఎక్స్సీ 90 కార్లతో పాటు జీప్ (వ్రాంగ్లర్) కంపెనీలు తమ వాహనాల ఫీచర్స్ను వివరించ
నున్నాయి. సుమారు 10కి పైగా కార్ల కంపెనీలతో పాటు ద్విచక్ర వాహన కంపెనీలు సైతం ఆటో షోలో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నాయి. మొదటి సారిగా పేరుమోసిన కార్ల కంపెనీలు వరంగల్ నగరంలో ఏర్పాటు చేసే ఆటో షోలో భాగస్వామ్యమవుతున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీలు, మోటార్ బైక్, ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు ఒకే వేదికపై తమ ఉత్పత్తులను ఏర్పాటు చేయడం కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారనుంది. కొనుగోలుదారులు హైదరాబాద్లాంటి నగరాలకు పరుగులు తీయకుండా వరంగల్ నగరంలోనే బ్రాండెడ్ కార్లను ‘ఆటో షో’ వేదికగా బుక్ చేసుకునే అవకాశం కలుగనుంది. అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్న వరంగల్ మహానగరంలో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆటో షో ద్వారా అన్ని ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ చేస్తున్నాయి. రెండు రోజుల పాటు కొనసాగే ఆటో షోలో ఆడీ, వోల్వో ఎక్స్ 90, జీప్(వ్రాంగ్లర్), స్కోడా, హుందాయ్, కియా, యమహా, నెక్సా, కిట్రాన్, చేతక్, హోండా కంపెనీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి.