వరంగల్, సెప్టెంబర్ 26: నగరంలో ప్రసిద్ధిచెందిన భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు నిత్యాహ్నికం తర్వాత భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రేవతి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. దాస్యం దంపతులు, మేయర్ గుండు సుధారాణికి ఆలయ ఈవో శేషుభారతి, ప్రధాన అర్చకుడు శేషు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారితోపాటు కుడా సుందర్రాజ్ వల్లభ గణపతిని తొలుత దర్శించుకున్నారు. అనంతరం భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని ఉదయం వృషభవాహన సేవ, సాయంత్రం మృగవాహన సేవపై ఊరేగించారు.
అమ్మవారి బంగారు ఆభరణాల ఊరేగింపు
భద్రకాళీ అమ్మవారి బంగారు ఆభరణాలను ఆలయ అధికారులు కోలాటాల మధ్య ఆలయ ఆర్చి గేట్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. గతంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు భద్రకాళీ అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించిన నగలతో అలంకరించారు. ఆలయ ఈవో శేషుభారతి యూనియన్ బ్యాంక్లో ఉన్న బంగారు కిరీటం, ఇతర ఆభరణాలను పోలీసు బందోబస్తు మధ్య ఆలయానికి తీసుకొచ్చారు. ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో బంగారు ఆభరణాలను అమ్మవారికి అలంకరించారు.
తొలిరోజు బాలాత్రిపుర సుందరిగా..
భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజు ఆలయంలలో భేరీపూజ, ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని బాలత్రిపుర సుందరిగా అలంకరించగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. హైదరాబాద్ వాస్తవ్యులు శివపురం రాజేశ్వర్మ రూ.10లక్షల విలువైన ఎల్ఈడీ స్క్రీన్ను విరాళంగా అందచేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ను చీఫ్విప్, మేయర్ ప్రారంభించారు.