కాళేశ్వరం, సెప్టెంబర్ 13: గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం 12.35 మీటర్ల ఎత్తులో 10.09లక్షల క్యూసెక్కుల వరకు పారుతున్నట్లు అధికారులు తెలిపారు. పుష్కరఘాట్ వద్ద మూడో రోజు కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. పుష్కరఘాట్ పూర్తిగా మునగడంతో పోలీసులు భక్తులను లోతుకు పోనివ్వడం లేదు.
రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద..
ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టుల నుంచి దిగువకు విడుదలవుతున్న వరదతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహం 15.830 మీటర్లకు చేరగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. సోమవారం మొద టి ప్రమాద హెచ్చరిక జారీ మంగళవారం రెండో ప్రమాద హెచ్చరికను సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు జారీ ఇక గోదావరి వరద జంపన్నవాగులోకి పోటెత్తింది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద మెట్లు పూర్తిగా మునిగిపోయాయి. సాయంత్రం వరకు 15.840 మీటర్లకు చేరుకున్నది. గోదావరి వరద నెమ్మదిగా పెరుగుతున్నది. వందలాది ఎకరాల పంట భూములు నీట మునిగాయి.
నీట మునిగిన పొలాలు
మంగపేట: గోదావరి ప్రవాహం పెరిగి బోరునర్సాపురం, కమలాపురం, అకినేపల్లిమల్లారం, కత్తిగూడెం గ్రామాల శివారు పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిర్చి మొక్క లు నాటేందుకు సిద్ధమవుతున్న సమయంలో తరచూ గోదావరి పొంగుతోంది. కమలాపురం ఇంటేక్ వెల్ వద్ద గోదావరి సముద్రమట్టానికి 82.5 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ, మంగళవారం సాయంత్రం నిలకడగా ఉంది.
సమ్మక్క బరాజ్ వద్ద..
కన్నాయిగూడెం: మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. ఉదయం నుంచి తగ్గుతూ నీటిమట్టం 84.1 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి బరాజ్లోకి 10 లక్షల 15వేల క్యూసెక్కులు వస్తుండటంతో అంతే మొత్తంలో గేట్లన్నింటినీ ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా వాగుల నుంచి ఉప్పొంగి వచ్చిన గోదావరి నీటిలోనే ముప్పనపల్లి, గూర్రేవుల, బుట్టాయిగూడెం, రాజన్నపేట శివార్లలోని పొలాలు మునిగిపోయాయి.
నిలిచిన రాకపోకలు
వెంకటాపురం(నూగూరు): మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా గోదావరి వరద పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచాయి. మండల పరిధిలోని బోదాపురం, కుక్కతోగువాగు, పాలెంవాగు సమీపాల్లో గోదావరి వరద నీరు రోడ్ల పైకి చేరడంతో నిలిచాయి. గోదావరి వరద పరిస్థితులను మండల అధికారులు అంటి నాగరాజు, జడ్పీటీసీ పాయం రమణ, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
పూసూరు ముల్లకట్ట బ్రిడ్జి వద్ద..
వాజేడు: మండలంలోని పూసూరు ముల్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి పుష్కరఘాట్ వద్ద తగ్గింది. రెండురోజులుగా పెరిగి 46 అడుగుల మేర ప్రవహించిన గోదావరి మంగళవారం మధ్యాహ్నం నుంచి స్వల్పంగా తగ్గుతోంది. గోదావరి వరదలతో మూడురోజులుగా చత్తీస్గఢ్ రాష్ర్టానికి రాకపోకలు నిలిచాయి. గోదావరి జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు నాలుగుసార్లు పెరిగి తగ్గుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.