హనుమకొండ, ఏప్రిల్ 18: తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల కృషి మరువలేనిదని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మంగళవారం టీజీవో ఉమ్మడి వరంగ్ జిల్లా కో ఆర్డినేటర్ ఏ జగన్మోహన్రావు అధ్యక్షతన టీజీవో హనుమకొండ, వరంగల్ జిల్లాల సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీనివాస్గౌడ్, విశిష్ట అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, మార్గదర్శకాల మేరకు ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో పని చేస్తున్నందుకే రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.
రామప్ప చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులతోపాటు టీజీవోలు ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఉద్యోగుల ఎనలేని కృషి వల్లే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులపై సీఎం కేసీఆర్కు ఎనలేని మమకారం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఇక్కడ ఉన్నాయని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇస్తున్నది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నందునే భూములకు విలువ పెరిగిందన్నారు. పాత పెన్షన్ అమలయ్యేలా కృషి చేస్తానన్నారు. తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులను కోరారు.
ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత మాది..
ప్రభుత్వ ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత తమదేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో పని చేయడం వల్లే రాష్ర్టానికి గుర్తింపు వచ్చిందన్నారు. అవార్డుల విషయంలో కూడా కేంద్రం రాష్ట్రంపై వివక్ష చేపిస్తున్నదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు 43 శాతం పిట్మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. పదవి విరమణను 58 నుంచి 61 ఏళ్లకు పెంచారని గుర్తుచేశారు. సమస్యలుంటే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ ఉద్యోగుల కృషి వల్లే రాష్ర్టానికి అనేక అవార్డులు వస్తున్నాయని కొనియాడారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని, బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందుకు టీజీవో ఉద్యోగ సంఘాల నాయకులు హనుమకొండలో సొంత కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, టీజీవో వరంగల్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, రాజేశ్కుమార్, శామ్యూల్, సంజీవరెడ్డి, రాజ్కుమార్, ఫణికుమార్, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్కుమార్, టీఎన్జీవో యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, మేన శ్రీను, సోమన్న, ఆస్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.