కాళేశ్వరం, మార్చి 6 : మహా శివరాత్రికి కాళేశ్వరం వచ్చే భక్తులకు తిప్పలు తప్పేలా లేవు. రేపు ఉత్సవాలు మొదలవనుండగా అధికారులు గానీ, ఇటు దేవస్థానం సిబ్బంది గానీ ఎక్కడా కనిపించడం లేదు. జాగరణ కోసం తెలంగాణ, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. ప్రతిసారి శివరాత్రికి నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ఘనంగా చేపట్టేది. కానీ, ఈసారి ఏర్పాట్లు చేయాలనే ధ్యాస ఎవరిలోనూ కనిపించడం లేదు.
కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థానం నుంచి మొదలు త్రివేణి సంగమం వరకు పారిశుధ్య లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గోదావరి పుష్కర ఘాట్, నది వద్ద ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో స్థానిక అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఏంటని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.