హనుమకొండ, సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి హనుమకొండ న్యూశాయంపేట జంక్షన్ సమీపంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐలమ్మ నాడు నిరంకుశ నిజాం రజాకారులు, దేశ్ముఖ్లకు ఎదురొడ్డిన వీరవనిత, ధైర్యశాలి అని కొనియాడారు. నిజాంపాలన, విస్నూరు దేశ్ ముఖ్కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ రాయపర్తి మండలం కిష్టాపురంలో1895 సెప్టెంబర్ 26న జన్మించారని తెలిపారు.
పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహం జరగ్గా వారికి ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు సంతానమని తెలిపారు. పట్వారీ పొలంలోకి పనిచేసేందుకు రాని ఐలమ్మ కమ్యూనిస్టుల్లో చేరిందని దేశ్ముఖ్కు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. ఐలమ్మ సాగు చేసిన పొలాన్ని తన పేర రాయించుకొని, పొలం, పంట కూడా తనదేనని దేశ్ముఖ్ తన మనుషులను పంపాడని, ఈసమయంలో సంఘం సాయంతో వాళ్లను తిప్పి పంపిన ఐలమ్మ, కోర్టులో కేసు వేసి, నాడు లాయర్ కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో గెలిచిందని వివరించారు. నాడు సంఘంగా పిలిచే కమ్యూనిస్టులతో చేయి కలిపి తన పొలాన్ని దేశ్ముఖ్ గూండాల నుంచి ఐలమ్మ కాపాడుకున్నారని తెలిపారు.
ఐలమ్మ తన 90వ ఏట 1985 సెప్టెంబర్ 10న పాలకుర్తిలో మరణించారని తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారని చెప్పారు. అదేస్ఫూర్తి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలించదని తెలిపారు. ఐలమ్మ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తుండటంపై సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ప్రావీణ్య, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.