మహబూబాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు ఉచితంగా పంపిణీ చేస్తున్న హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) టీకాపై ప్రచారం కల్పించడంలో సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తున్నది. సరైన ప్రచారం లేకపోవడంతో కొంతకాలంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళల్లో అత్యధికులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత మార్చి 8న టీకా పంపిణీని ప్రారంభించింది. 14 ఏళ్లు నిండి 15 సంవత్సరాలలోపున్న బాలికలకు మాత్రమే టీకాను పంపిణీ చేస్తున్నారు. అయితే, మహబూబాబాద్ జిల్లాలో సర్వే చేసిన వైద్య సిబ్బంది ఇప్పటి వరకు 6,687 మంది బాలికలున్నట్లు గుర్తించి, టీకా పంపిణీ ప్రారంభించారు.
తొలి విడతలో జిల్లాకు 1,513 డోస్ల వ్యాక్సిన్ వచ్చింది. దీంతో 20 పీహెచ్సీలు, ఒక యూపీహెచ్సీకి పంపిణీ చేశారు. మూడు నెలల వ్యవధిలో 1,211 మందికి (17.2 శాతం) మాత్రమే వ్యాక్సినేషన్ చేశారు. జిల్లాలోని బయ్యారం, డోర్నకల్, గంగారం, ఇనుగుర్తి, కేసముద్రం, తీగలవేణి, ఉగ్గంపల్లి వంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొద్దిరోజుల పాటు పంపిణీ చేశారు. అనంతరం కొరత ఏర్పడడంతో ఆయా కేంద్రాల్లో నిలిచి పోయింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం జిల్లాకు 3,966 డోస్ల వ్యాక్సిన్ వచ్చింది. ప్రతి పీహెచ్సీకి 50 డోసుల చొప్పున పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,320 (19.73 శాతం) మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే, వైద్య శాఖ అధికారులు టీకాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నా సరైన ప్రచారం లేకపోవడంతో స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారించే హెచ్పీవీ వ్యాక్సిన్పై బాలికలు, తల్లిదండ్రుల్లో సరైన అవగాహన లేదు. దీంతో బాలికలకు టీకా ఇప్పించేందుకు విముఖత చూపుతున్నారు. ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. ఈ టీకాను బయటి మార్కెట్లో రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు విక్రయిస్తున్నారు. టీకా తీసుకుంటే భవిష్యత్లో ఏమైనా సమస్యలు తలెత్తుతాయేమోననే అపోహతో బాలికలు ముందుకు రావడం లేదు. హెచ్పీవీతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. అమెరికా వంటి దేశాల్లో గర్భాశయ క్యార్సర్ నివారణకు ఈ టీకా దోహదపడినట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైందని చెబుతున్నారు.
బాలికలకు అందించే హెచ్పీవీ వ్యాక్సిన్పై తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. అపోహలు వీడాలి. ఈ టీకాతో భవిష్యత్లో బాలికలకు గర్భాశయ క్యాన్సర్ రాదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇప్పటికే 1,277 మంది బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చాం. దీనిపై వైద్యాధికారులు, సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వ్యాక్సిన్ను పంపిణీ చేస్తాం.
-రవి రాథోడ్, జిల్లా వైద్యాధికారి, మహబూబాబాద్