గిర్మాజీపేట, జూన్ 22 : పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వెల్లడించారు. తండ్రి నన్నపునేని నర్సింహమూర్తి జ్ఞాపకార్థం ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం తెలిపారు. ఇందుకు సంబంధించిన లోగో, కరపత్రాలను వరంగల్ చౌరస్తాలోని మహేశ్వరి గార్డెన్లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఎన్ ట్రస్టు కార్యక్రమాలను ఎమ్మెల్యే సతీమణి వాణి, కొడుకు లోకేశ్పటేల్ నిర్వహిస్తారన్నారు. అలాగే, ట్రస్టు ద్వారా శిక్షణ పొందే ఉద్యోగార్థులకు ఉచిత భోజనం, మెటీరియల్ అందిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ యువత శ్రేయస్సు దృష్ట్యా వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారన్నారు.
పోలీస్ ఈవెంట్స్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనర్ను నియమించామని తెలిపారు. గ్రూప్స్కు నిష్ణాతులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ప్రముఖ సైకియాట్రిస్ట్ బరుపాటి గోపి అభ్యర్థులను గైడ్ చేస్తారన్నారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దిడ్డి కుమారస్వామి, కార్పొరేటర్లు శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారన్నారు. ఉచిత శిక్షణకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించి జూన్ 30వరకు కొనసాగిస్తామన్నారు. జూలై ఒకటి నుంచి ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించి 90 రోజులు నడిపిస్తామన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్నారు. అలాగే. ఉచిత శిక్షణకు సహకరిస్తున్న మహేశ్వరి గార్డెన్ యజమాని, దీనిలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 67 మంది లబ్ధిదారులకు రూ. 60.58 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గందె కల్పనానవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంతోనే ఆనందం మెండు..
పోచమ్మమైదాన్ : ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆనందంతో జీవితం కొనసాగుతుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోచమ్మమైదాన్ సెంటర్ నుంచి ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ వాకింగ్తో పాటు వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ తదితరులు పాల్గొన్నారు.