మహిళా చైతన్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనంలోని గోడౌన్, కాట్రపల్లి గ్రామంలోని రైతువేదిక భవనంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న మహిళా ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాలను సందర్శించారు. శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కుట్టు శిక్షణ పొందిన మహిళలకు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. రాజకీయాలకతీతంగా స్నేహితుల సహకారంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
– రాయపర్తి, ఆగస్టు 11
రాయపర్తి, ఆగస్టు 11 : మహిళా చైతన్యంతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యుడు ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలోని పీఏసీఎస్ భవనం గోడౌన్, మండలంలోని కాట్రపల్లి గ్రామ రైతువేదిక భవనాల్లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న మహిళా ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కుట్టు శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదు పొందుతున్న మహిళలు, యువతులతో మంత్రి మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రజలందరి కుటుంబాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం-ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణా కేంద్రాల్లోని మహిళలంతా భవిష్యత్లో ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
శిక్షణ పొందిన మహిళలకు జిల్లాలో నూతనంగా ఏర్పాటవుతున్న టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు మంత్రి ఎర్రబెల్లి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, ఆయా గ్రామాల సర్పంచ్లు గారె నర్సయ్య, పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, మండల నాయకులు అయిత రాంచందర్, బానోత్ భద్రూనాయక్, ఎండీ నయీం, ఉస్మాన్, అక్బర్, వనజారాణి, సత్యం, నర్సింహామూర్తి, లేతాకుల యాదవరెడ్డి, మహ్మద్ అన్వర్, కత్తి సోమన్న, శ్రీనివాస్, అమరావతి, నర్మద పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై తమకున్న ఆదరాభిమానాన్ని మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఉచిత కుట్టు శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న మహిళలు చాటుకున్నారు. వారంతా కొంత కాలంగా వ్యక్తిగతంగా జమ చేసుకున్న నగదు రూ.3500ను మూటగట్టి వచ్చే ఎన్నికల్లో నామినేషన్ రుసుం కోసం వినియోగించాల్సిందిగా కోరుతూ మంత్రి ఎర్రబెల్లికి అందజేశారు. మహిళలు తన ఎన్నికల వ్యయానికి అవసరమయ్యే సొమ్మును స్వచ్ఛందంగా అందజేయడంతో మంత్రముగ్ధుడైన మంత్రి ఎర్రబెల్లి మండల ప్రజలు, మహిళా లోకానికి రుణపడి ఉంటానన్నారు.
హనుమకొండ : తన వద్దకు వివిధ పనుల కోసం వచ్చే సందర్శకుల సౌకర్యార్థం క్యాంపు కార్యాలయాల్లో అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. హనుమకొండ ఆర్అండ్బీ అతిథి గృహానికి పలు ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం శుక్రవారం ఆల్పాహారాన్ని స్వయంగా వడ్డించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి నియోజక వర్గం నుంచేగాక వివిధ పనులపై అనేక మంది తన వద్దకు వస్తున్నారని, వాళ్లందరికీ ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే అల్పాహారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తన వద్దకు వచ్చే వాళ్లకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఉంటుందని తెలిపారు. అయితే, ఇందుకు భిన్నంగా పెద్ద మొత్తంలో సందర్శకుల కోసం ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. తాను అందుబాటులో ఉండే హైదరాబాద్ మంత్రుల నివాసం, హనుమకొండలోని ఆర్అండ్బీ అతిథి గృహం, పాలకుర్తి క్యాంపు కార్యాలయం, పర్వతగిరిలోని తమ ఇంటి వద్ద ఈ సదుపాయం ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.