వరంగల్, జనవరి 6 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరో ఘనతను సొంతం చేసుకుంది. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ (ఎంవోయూఏ) మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నగరాల జాబితాలో గ్రేటర్ వరంగల్ వరుసగా నాలుగోసారి స్థానం సంపాదించింది. దేశ వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో అతి కొద్ది నగరాలే ఈ ఘనతను సాధించాయి. వరుసగా 2020 నుంచి 2021, 2022, 2023లో ఓరుగల్లు సత్తా చాటుతూ రావడం గొప్పవిషమని అధికారయంత్రాంగం ప్రకటించింది. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పట్టణ ప్రగతితో వరంగల్ మహానగరం సమగ్రంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణలో ఉత్తమంగా నిలుస్తున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రతి నెలా రూ.7.50 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పారిశుధ్య నిర్వహణ పనులు పూర్తయ్యాయి. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణను పక్కాగా నిర్వహించింది. ఆటోలు, ట్రాక్టర్లు, లారీలతో ప్రతిరోజూ చెత్తను తరలించింది. డంపింగ్ యార్డు నిర్వహణతోపాటు మానవ వ్యర్థాల నిర్వహణలోనూ జీడబ్ల్యూఎంసీ కొత్త విధానాన్ని అమలు చేసింది. అమ్మవారిపేటలో ఏర్పాటు చేసిన మావన వ్యర్థాల ప్లాంటుతో గ్రేటర్ వరంగల్ నగరం ఓడీఎఫ్లో ఉత్తమంగా నిలిచేందుకు మార్గం సుగమమైంది.
మేయర్ హర్షం
ఎంవోయూఏ రూపొందించిన ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ జాబితాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరుసగా నాలుగో సంవత్సరం కూడా చోటు సాధించినందుకు మేయర్ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పరిధిలో ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం, ఆధునిక పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు, నిర్వహణతో పాటు మురుగునీటి శుద్ధీకరణ (ఎస్టీపీ) మానవ వ్యర్థాల శుద్ధీకరణ (ఎఫ్ఎస్టీపీ) కోసం చేపడుతున్న విధానాలు, ప్రతి మూడు సంవత్సరాలకోసారి ప్రతి ఇంటి సెప్టిక్ ట్యాంకుల నుంచి మానవ వ్యర్థాల సేకరణ, నూతన ట్యాంక్ క్లీనింగ్ యంత్రాలకు అనుమతుల మంజూరు, కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు యంత్రాల వినియోగంలాంటి చర్యల వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. త్వరలో ఎంవోయూఏ నుంచి సర్టిఫికెట్ అందుకోనున్నట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2023 స్వచ్ఛ సర్వేక్షన్ పోటీల్లో మరింత మెరుగైన ర్యాంకు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్లో వరుసగా నాలుగోసారి చోటు దక్కడం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, కార్పొరేటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్లో వరంగల్కు చోటు దక్కేందుకు చేసిన కృషిని వివరించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు పోతూ కార్పొరేషన్ పరిధిలో మరింత ప్రగతి సాధించేందుకు కృషి చేస్తామన్నారు.
కేంద్ర మంత్రిత్వశాఖ అభినందనలు
బహిరంగ మల, మూత్ర విసర్జన నియంత్రణకు వరంగల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు, వాటికి సాంకేతికత అనుసంధానం, పక్కాగా నిర్వహణ లాంటి చర్యలు అభినందనీయమని సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వశాఖ కొనియాడింది. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో చేపట్టిన, అనుసరిస్తున్న ఆధునిక శానిటేషన్ సంబంధ విధానాలను ప్రమాణాలుగా తీసుకొని ఎంపిక చేసినట్లు వివరించింది.