తాడ్వాయి, ఫిబ్రవరి 4 : వ్యవసాయ పనుల కోసం మహిళా కూలీలను తీసుకెళ్తున్న ఆటో అతివేగంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం మేడారానికి చెందిన చిడెం రాంబుబుకు చెందిన పొలంలో వరినాట్లు వేసేందుకు గోవిందరావుపేట మండలం మొద్దులగూడేనికి చెందిన 18 మంది మహిళా కూలీలను గుత్తకు మాట్లాడుకున్నారు. శనివారం నాటు వేసేందుకు కూలీలను తీసుకురావాలని గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చిడెం నాగార్జునను పంపారు. ఉదయం మొద్దులగూడేనికి వెళ్లి 18 మంది మహిళా కూలీలను ఆటోలో తీసుకుని బయల్దేరారు. అతివేగంతో వస్తున్న ఆటో నార్లాపురంలోని మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది.
ఈ ఘటనలో మల్లెబోయిన సునీత(30) అక్కడిక్కడే మృతిచెందింది. బానోత్ జ్యోతి(28)కి తీవ్రగాయాలవడంతో వరంగల్లోని ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమాధ్యంలో మృతిచెందింది. గాయపడిన వారిలో మల్లెబోయిన స్వాతి, తొడుగు ఏకమ్మ, లౌడియా శ్రీజ, లక్ష్మి, రాజేశ్వరి, బానోత్ రాజేశ్వరి, నూనావత్ లలిత, గుగులోత్ లలిత, రుద్రారపు స్వర్ణలత, రసపుత్ విజయ, రసపుత్ మల్లమ్మ, దార్ల స్వరూప, మల్లెబోయిన పావని, కాసాని బుగ్గమ్మ, రసపుత్ జమున, లావుడ్యా రాజమ్మ ఉన్నారు. బాధితులను ములుగులోని దవాఖానకు తరలించారు. క్షతగాత్రులకు డీఎంహెచ్వో అప్పయ్య వైద్యసేవలు అందించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవల కోసం వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్థానిక ఎస్సై వెంకటేశ్వర్రావును వివరణ కోరగా బాధితుల నుం చి ఫిర్యాదు అందలేదన్నారు.