వరంగల్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : వరంగల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ) పనులు వడివడిగా సాగుతున్నాయి. కొత్త కలెక్టరేట్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.80కోట్లు మంజూరు చేసి, వరంగల్ నర్సంపేట రోడ్డులోని ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో ఇటీవల సుమారు 18 ఎకరాలు కేటాయించింది. జూన్ 17న పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయగా, టెండర్ దక్కించుకున్న గౌరీశంకర్ ఇన్ఫ్రా సంస్థ పనులు ప్రారంభించింది. స్థలంలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి లెవలింగ్ చేసి, తమ కార్యాలయాలు, ఇంజినీర్లు, లేబరు నివసించేందుకు తాత్కాలిక షెడ్లు నిర్మిస్తున్నది. ఇతర జిల్లాల్లోలాగే వరంగల్ ఐడీవోసీ కోసం ఆర్అండ్బీ ఇంజినీర్లు జీ ఫ్లస్ టూతో డిజైన్ సిద్ధం చేయగా, ప్రస్తుతం పునాది పనులు చేపట్టారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ) నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రహదారులు, భవనాల (ఆర్అండ్బీ) శాఖ టెండర్ ఖరారు చేసింది. పనులు దక్కించుకొన్న సంస్థ రంగంలోకి దిగింది. తమ సంస్థ కార్యాలయాల నిర్వహణ, ఇంజినీర్లు, లేబరు నివాసం కోసం ఇక్కడ రేకులతో తాత్కాలిక షెడ్లు నిర్మిస్తున్నది. ఐడీవోసీ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఉన్న పిచ్చి చెట్లు, చెత్తాచెదారాన్ని తొలగించింది. గుంతలను పూడ్చేసింది. పనులు జరిగే స్థలాన్ని కొద్దిరోజుల నుంచి లెవలింగ్ చేసింది. ఇక్కడ కరెంటు, నీటి సరఫరా, డ్రైనేజీ వంటి కనీస వసతులను కల్పించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో తాజాగా ఐడీవోసీ నిర్మాణం కోసం ఫౌండేషన్ పనులు ప్రారంభమయ్యాయి. క్షేత్రస్థాయిలో ఆర్అండ్బీ ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు.
వరంగల్లోని నర్సంపేట రోడ్డులో గల అజంజాహి మిల్స్ గ్రౌండ్ స్థలంలో నుంచి ఐడీవోసీ నిర్మాణం కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సుమారు 18 ఎకరాల భూమి కేటాయించటం, ఈ స్థలంలో ఐడీవోసీ నిర్మాణ పనులకు గత జూన్ 17న మంత్రి కేటీ రామారావు భూమి పూజ, శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ ఐడీవోసీతో పాటు కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల క్వార్టర్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇటీవల ఆర్అండ్బీ శాఖ టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. ప్రధానంగా ఈ పనుల కోసం రెండు ప్రముఖ కాంట్రాక్టు సంస్థలు పోటీపడ్డాయి. వీటిలో ఒకటి గౌరీశంకర్ ఇన్ఫ్రా, రెండోది డీఈసీ. ఈ రెండు సంస్థలకు ఐడీవోసీలు, మెడికల్ కాలేజీల వంటివి నిర్మించడంలో అనుభవం ఉంది. చివరకు వరంగల్ ఐడీవోసీ నిర్మాణ పనుల టెండర్ను గౌరీశంకర్ ఇన్ఫ్రా సంస్థ కైవసం చేసుకున్నది. దీంతో కొద్ది రోజుల క్రితం ఐడీవోసీ నిర్మాణం జరిగే స్థలంలో మట్టి నమూనాలు సేకరించారు. పరీక్షల అనంతరం ఆర్అండ్బీ శాఖ అధికారులు ఐడీవోసీ ఫౌండేషన్, డిజైన్పై ఒక నిర్ణయానికి వచ్చారు. పనులు మొదలైన రోజు నుంచి 18 నెలల కాలపరిమితిలో ఈ ఐడీవోసీ, క్వార్టర్ల నిర్మాణాన్ని గౌరీశంకర్ ఇన్ఫ్రా సంస్థ పూర్తి చేయాల్సి ఉంది.
జీ ప్లస్ టూతో డిజైన్
ఇప్పటికే హనుమకొండతో పాటు పలు జిల్లాల్లో నిర్మించిన ఐడీవోసీల మాదిరిగానే వరంగల్ ఐడీవోసీ నిర్మాణం కోసం ఆర్అండ్బీ ఇంజినీర్లు జీ ప్లస్ టూతో డిజైన్ చేశారు. 1.50 లక్షల చదరపు అడుగులతో నిర్మించే ఈ డిజైన్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వరంగల్ ఐడీవోసీని జీ ప్లస్ త్రీ లేదా ఫోర్తో నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొత్తగా ఏర్పడిన వరంగల్ జిల్లా కేంద్రంలో ఏ ప్రభుత్వ శాఖకు సొంత భవనం లేదని, ఇంజినీరింగ్ విభాగాలు సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ప్రస్తుతం హనుమకొండలో కొనసాగుతున్నందున ఇక్కడ జీ ప్లస్ టూతో నిర్మిస్తే ఐడీవోసీ సరిపోదని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల నిర్వహణకు కేటాయించాల్సిన అవసరం ఉన్నందున జీ ప్లస్ త్రీ లేదా ఫోర్తో ఐడీవోసీ నిర్మించడం అనివార్యమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్అండ్బీ ఇంజినీర్లు జీ ప్లస్ త్రీ లేదా ఫోర్తో నిర్మించాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే భవిష్యత్తులో ఆ మేరకు పనులు చేయడానికి అనువుగా డిజైన్ తయారు చేసి ప్రస్తుతం జీ ప్ల్లస్ టూతో ఐడీవోసీ నిర్మాణ పనులు చేపట్టేందుకు నిర్ణయించారు.
పనులను మొదలుపెట్టేందుకు గౌరీశంకర్ ఇన్ఫ్రా సంస్థ సిద్ధం కావడంతో కొద్దిరోజుల క్రితం కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనరు షేక్ రిజ్వాన్ బాషా, వరంగల్ ఆర్డీవో వాసుచంద్ర, ఆర్అండ్బీ ఎస్ఈ నాగేందర్రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఐడీవోసీ స్థలాన్ని సందర్శించారు. ఇక్కడ పనులు జరగడానికి అవసరమైన మౌలిక వసతుల కోసం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచనలు చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతుండడంతో గౌరీశంకర్ ఇన్ఫ్రా సంస్థ ఇంజినీర్లు, కార్మికులు కొద్దిరోజుల నుంచి ఇక్కడ దిగారు. కార్యాలయాల నిర్వహణతో పాటు తమ నివాసం కోసం రేకులతో తాత్కాలిక మోడ్రన్ షెడ్లు నిర్మిస్తున్నారు. సోమవారం ఐడీవోసీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఫౌండేషన్ కోసం భారీ యంత్రాలతో పనులు నిర్వహిస్తున్నారు. ఆర్అండ్బీ అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఫౌండేషన్ పనులను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు.