మహబూబాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు మానుకోటలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనుల పోడు కలను సాకారం చేసేందుకు మంత్రి కేటీఆర్ వస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ జనవరిలో ప్రకటించిన మేరకు మున్సిపాలిటీలో రూ.50కోట్లతో తహసీల్దార్ కార్యాలయ సమీపంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. గ్రంథాలయ సమీపంలో రూ.5కోట్లతో నిర్మించిన వెజ్, నాన్వెజ్, ఫ్రూట్ మార్కెట్లను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాంచంద్రాపురం చేరుకొని రూ.12కోట్లతో నిర్మించిన 200 డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో 25,254 మంది పోడు రైతులకు 71,797 ఎకరాల పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తారు. ఇక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరుతారు.
పట్టణం ముస్తాబు
మంత్రి కేటీఆర్ రాకకోసం మానుకోట పట్టణం ముస్తాబైంది. బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు, తోరణాలతో మానుకోట మొత్తం గులాబీమయమైంది.
భారీ బందోబస్తు..
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎస్పీ శరత్చంద్రపవార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ, మగ్గురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 35 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, 68 మంది హెడ్కానిస్టేబుళ్లు, 177 మంది కానిస్టేబుళ్లు, 30 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో ఉండనున్నారు.
విజయవంతం చేయాలి
మహబూబాబాద్, జూన్ 29 : మంత్రి కేటీఆర్ పర్యటనకు అధికారులు పూర్తి బందోబస్తు కల్పించి విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఆదేశించారు. ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ కే శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం, వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రాంచంద్రాపురం కాలనీలోని డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులతో జరిగే సభ ఏర్పాట్లపై చర్చించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
– మంత్రి సత్యవతిరాథోడ్