వర్ధన్నపేట, జూన్ 20 : విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో జరిగిన విద్యాదినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల కోసం రూ.28లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో వేయి గురుకులాలకు పైగా ఏర్పాటు చేశారన్నారు. సమైక్య రాష్ట్రంలో పట్టించుకోకపోవడం వల్ల పేదలకు ఏమాత్రం నాణ్యమైన విద్య అందలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన వసతులు లేకపోవడంతో ఉపాధ్యాయులు కూడా తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేపట్టిన పనులతో పాటు ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు, చిన్నారులకు అవసరమైన ఫర్నిచర్, తాగునీటి వసతి, డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసిందన్నారు. దీని ఫలితంగానే నేడు తెలంగాణ విద్యార్థులు జాతీయస్థాయి విద్యాలయాల్లో సీట్లు సాధిస్తున్నారన్నారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే రమేశ్కు గ్రామానికి చెందిన మహిళలు, విద్యార్థులు కోలాటంతో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, వైస్ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, సర్పంచ్ మంగ, ఏఎంసీ చైర్మన్ కమ్మగోని స్వామిరాయుడు పాల్గొన్నారు.
పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి
ఐనవోలు : పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వాదించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఐనవోలు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కస్తూర్భాగాంధీ విద్యాలయం ప్రారంభోత్సవంతోపాటు, రూ.2.30కోట్లతో జూనియర్ కాలేజీ భవన నిర్మాణ పనులకు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మార్నేని మధుమతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో 30 హాస్టళ్లు వచ్చిన్నట్లు గుర్తు చేశారు. పేద బిడ్డల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం పెట్టడమే కాకుండా రాగి జావను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదేనన్నారు. కష్టల్లో ఉన్న వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానన్నారు. రాజకీయాలకతీతంగా అందరి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్లుగా నియోజకవర్గానికి పట్టించిన పాకురును నెమ్మదిగా క్లీన్ చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తొమ్మిదేళ్లలో నియోజకవర్గంలో సంక్షేమానికి రూ.21.91 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే నెలలో జాగా ఉన్న వారికి ఇండ్లు ఇచ్చే పథకాన్ని ఐనవోలు నుంచే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. ఐనవోలు, ఒంటిమామిడిపల్లి గ్రామాల రెవెన్యూ సమస్య అత్యంత సున్నితమైనదని, దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. అలాగే, ఎల్లమ్మ చెరువు సమస్యను ముదిరాజ్ కులస్తులు ఎమ్మెల్యే దృష్టికితీసుకురాగా, అధికారులను ఆదేశించారు. కాగా, మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా పార్టీ నుంచి మంజూరైన రూ.2లక్షల బీమా చెక్కును బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, రైతుబంధుసమితి మండల కోఆర్డినేటర్ మునిగాల సంపత్కుమార్, జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్అలీ, తహసీల్దార్ రాజేశ్, ఎండీవో వెం కటరమణ, ఎంఈవో వెంకటేశ్వర్రావు, ఎస్వో కోటగిరి సునీత, సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ కల్పన, వైస్ ఎంపీపీ మోహన్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దేవేందర్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు సోమేశ్వర్రావు, ఉప సర్పంచ్ సతీశ్, పార్టీ మండల అధ్యక్షుడు శంకర్రెడ్డి,కోఆప్షన్ గుంషావలి, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, గ్రామఅధ్యక్షుడు పరమేశ్ పాల్గొన్నారు.