చిట్యాల, మే 27 : తెలంగాణ సమగ్రాభివృద్ధిలో దూసుకెళ్తూ దేశానికే దిక్సూచిలా మారిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు, ప్రారంభోత్సవాలకు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి హాజరయ్యారు. మండల కేంద్రంలో నిర్మించనున్న తెలంగాణ క్రీడా కాంప్లెక్స్ నిర్మాణ పనులకు బోయినపల్లి శంకుస్థాపన చేయగా, రూ.25లక్షలతో నిర్మించి ఎస్సీ కమ్యూనిటీహాల్ను ఎంపీ పసునూరి దయాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ పల్లె పల్లెకు నిధులు పంపుతూ పల్లెలను ప్రగతి పథంలో నడుపుతున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరవు నేలల్లో కన్నీళ్లు మిగిలే ఎస్సారెస్పీ కెనాల్ డీబీఎం-38 ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించి కరవులో ఉన్న చిట్యాలను చిగురిస్తున్న చిట్యాలగా మార్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. చిట్యాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. ఎంపీపీ దావు వినోదా వీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్రెడ్డి, సర్పంచ్ పూర్ణ చందర్రావు, ఎంపీటీసీ కట్కూరి పద్మానరేందర్, కోఆప్షన్ సభ్యులు ఎండీ రాజ్మహ్మద్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కామిడి రత్నాకర్రెడ్డి పాల్గొన్నారు.