హనుమకొండ, డిసెంబర్ 22: ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకులకు సంక్షేమ చట్టం చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్తో కలిసి భవన నిర్మాణ కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి ఇన్సూరెన్స్ భరోసా ఇస్తుందని అన్నారు.
తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రైవేట్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టామని తెలిపారు. 52 శాతం విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారని, వారికి విద్యను అందిస్తున్న ప్రైవేటు అధ్యాపకులకు సంక్షేమ చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పాఠశాలల నిర్వాహకులు ముందుకు రావాలని కోరారు. ఈ చట్టం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజుయాదవ్, సీనియర్ నాయకులు మేడిపల్లి శోభన్, మైనార్టీ నాయకుడు నయీం, కార్పొరేటర్ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకుడు చింతల యాదగిరి పాల్గొన్నారు.