ధర్మసాగర్, జూలై 19 : కాంగ్రెస్ ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని, రైతులకు బోనస్ ఎగవేత, ఎరువుల కొరత ఏర్పడిందని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శలు గుప్పించారు. ఆదివారం మండలంలోని మల్లక్పల్లి, కరుణాపురం, ఎల్కూర్తి, ధర్మసాగర్ గ్రామాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి బీఎల్ఏలకు ఆయన సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రైతుల పాలిట రేవంత్రెడ్డి రాక్షసుడిగా మారడాని ఆరోపించారు. రైతులకు మేలు జరిగే పనులను సీఎం విస్మరిస్తున్నాడని విమర్శించారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ద్వారా సూమారు 1.20లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ నుంచి కిందికి వెళ్లిపోయిందన్నారు.
ఆంధ్రా సీఎం చంద్రబాబు శిష్యుడిగా రేవంత్రెడ్డి తెలంగాణ నీళ్లను వారికి దోచిపెడుతున్నాడని విమర్శించారు. సుమారు 11 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ నుంచి కిందికి వదిలేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సరైన అవగాహన కల్పించకపోవడంతో సజావుగా సాగడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణాల్లో 20 నుంచి 25 శాతం మాత్రమే నమోదైందని, గ్రామీణ ప్రాంతాల్లో 55 శాతం వరకు మాత్రమే ఓట్లు నమోదైనట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కర్ర సొమిరెడ్డి, బొడ్డు ప్రతాప్, బేరే హరీశ్, లక్క శ్రీనివాస్, బెల్లం ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.