భూపాలపల్లి రూరల్, జనవరి 20 : భూపాలపల్లి జిల్లాకేంద్రం మంజూర్నగర్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా మొక్కు తీర్చుకునేందుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి కాలినడకన తిరుమల కొండకు శనివారం బయల్దేరారు. తొలుత జ్యోతితో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, వందల సంఖ్యలో భక్తులు వెంట రాగా కలిసి కాలినడకన తరలివెళ్లారు. జ్యోతితో కలిసి తాను కొద్దిదూరం పాదయాత్రలో పాల్గొంటానని గండ్ర తెలిపారు.
ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొంటా..
భక్తుల సౌకర్యార్థం, మంచి సంకల్పంతో ఆలయం నిర్మిస్తే కొందరు కుట్ర పూరితంగా కేసులు వేసి ఆటంకాలు సృష్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని గుడిని రాజకీయాలకు, వ్యక్తిగత కక్షలకు వాడుకోద్దని మాజీ ఎమ్మెల్యే గండ్ర సూచించారు. ఆనాడు భద్రాచలంలో రాముడికి ఆలయాన్ని నిర్మిస్తే భక్త రామదాసుకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయని, తనకు కూడా అలాంటి ఇబ్బందులొస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే ప్రస్తుతం కొందరు అక్రమ కేసులు పెట్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గండ్ర గౌతమ్రెడ్డి, మేకల సంపత్ యాదవ్, బుర్ర రమేశ్, గండ్ర హరీశ్రెడ్డి, కళ్లెపు రఘుపతి, సెగ్గం సిద్దు పాల్గొన్నారు.
చెల్పూర్లో అపూర్వ స్వాగతం
గణపురం : తిరుమలకు పాదయాత్రగా బయల్దేరిన గండ్ర జ్యోతికి, వెంట ఉన్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి గణపురం మండలం చెల్పూర్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మహిళలు మంగళహారతులతో అపూర్వ స్వాగతం పలికారు. సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్రావు శాలువా కప్పి సన్మానించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మోతె కరుణాకర్రెడ్డి, సర్పంచ్లు నల్లాని అరుణా తిరుపతిరావు, ఉప సర్పంచ్ రజియా, మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు నాయకులు రమేశ్, రవి, సాంబారెడ్డి, శ్రీనివాస్, దేవేందర్రావు, సాంబయ్య, సంపత్, కృష్ణస్వామి, ఉదయలక్ష్మి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.