రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం ద్వారా నగదు జమ కొనసాగుతున్నది. మూడో రోజు మూడెకరాల విస్తీర్ణం ఉన్న అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో సర్కారు డబ్బులు జమచేసింది. బుధవారం వరంగల్ జిల్లాలో 23,631 మందికి, హనుమకొండలో 33,472 మంది కర్షకులకు మొత్తం 39.66 కోట్ల పంట పెట్టుబడి సాయం అందజేసింది. మూడు రోజుల్లో రెండు జిల్లాల్లో కలిపి రూ.147.48 కోట్ల ఆర్థికసాయం పంపిణీ చేయగా, రైతులు సంబురం వ్యక్తం చేస్తున్నారు.
– వరంగల్, జూన్ 28(నమస్తేతెలంగాణ)/హనుమకొండ సబర్బన్
వరంగల్, జూన్ 28(నమస్తేతెలంగాణ)/హనుమకొండ సబర్బన్ : సమయానికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో ముందుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో ఇప్పటికే రైతుబంధు పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 1,24,493 మంది రైతులకు రూ.76.79 కోట్ల ఆర్థిక సాయం అందజేసింది. తొలి రోజు సోమవారం 59,249 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17,26,06,567 పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. రెండోరోజు మంగళవారం 41,613 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.30,63,67,335 ఆర్థిక సాయాన్ని జమ చేసినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. మూడోరోజు బుధవారం 23,631 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.28,89,68,411 పంట పెట్టుబడి సాయాన్ని రైతుబంధు పథకం ద్వారా జమ చేసినట్లు వెల్లడించింది. హనుమకొండ జిల్లాలో మొదటి రోజు ఎకరంలోపు ఉన్న 55,712 మంది రైతులకు రూ.16.12 కోట్లు జమ చేశారు. రెండో రోజైన మంగళవారం 93 వేల 204మంది రైతులకు రూ.43.8కోట్లు రైతుల ఖాతాల్లో చేరాయి. మూడో రోజు 33,472 మందికి రూ. 10.77 కోట్ల సాయం అందింది. మొత్తం లక్షా15,444 మందికి రూ.70.69 కోట్లు జమయ్యాయి.
మూడు రోజుల్లో రైతుబంధు పథకం నుంచి ఆర్థికసాయం పొందిన రైతుల సంఖ్య జిల్లాలో 1,24, 493కు చేరింది. మండలం వారీగా చెన్నారావుపేటలో 10,715, దుగ్గొండిలో 13,736, ఖానాపురంలో 6,630, నల్లబెల్లిలో 11,848, నర్సంపేటలో 11,3 35, నెక్కొండలో 13,610, గీసుగొండలో 12,496, ఖిలా వరంగల్లో 4,830, పర్వతగిరిలో 13,078, రాయపర్తిలో 17,419, సంగెంలో 14,162, వరంగల్లో 1,957, వర్ధన్నపేటలో 12,539 మంది ఉన్నా రు. రైతుబంధు పథకం నుంచి పంట పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన రైతుబంధు డబ్బులను పంట పెట్టుబడి కోసం వెచ్చిస్తున్నారు. ఒకవైపు వానలు పడుతుండడం, ఇదే సమయంలో మరోవైపు రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి అందుతుండడంతో ఆనందం వెలిబుచ్చుతున్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోళ్ల కోసం రైతులు పోటీ పడ్డారు. బ్యాంకుల, ఏటీఎంల ఎదుట రైతుబం ధు డబ్బులను డ్రా చేసుకునేందుకు బారులు తీరారు. సరైన సమయంలో రైతుబంధు రూపేనా నగదును అందించి ప్రభుత్వం ఆదుకుందని చెబుతున్నారు.